సోషల్ మీడియా ట్రెండ్స్ అన్నీ వాడేశారు

ఇవాళ విడుదలైన ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ లో బాగా హైలైట్ అయిన అంశం ఏదైనా ఉందంటే అది కామెడీనే. ముఖ్యంగా సోషల్ మీడియా ట్రెండ్స్ ని బలంగా వాడేశారు. అల వైకుంఠపురములో స్టైల్ లో పాత పాటలను బ్యాక్ గ్రౌండ్ లో ప్లే చేస్తూ హీరో హీరోయిన్ తో డాన్సులు చేయించడం అందులో ప్రధానమైంది. బాలయ్య ఫ్యాన్స్ ని ఎందుకు కొడతాడని అన్నపూర్ణ అడిగితే నితిన్ సమాధానం చెబుతూ అభిమానులు అబ్బనీ తీయని దెబ్బలా ఫీలవుతారని శ్రీలీలతో కలిసి చిరంజీవి, శ్రీదేవిలా స్టెప్పులు వేయడం బాగానే పేలింది. ఇది రెగ్యులర్ గా ఆన్ లైన్ లో వచ్చే టాపిక్కే.

ఇక విజయ్ దేవరకొండ రష్మిక మందన్నల ప్రస్తావనను నేరుగా తెచ్చేశారు. దానికి సమాధానంగా జులాయి సాంగ్ ప్లే చేసి నా ఇష్టం నీకెందుకు అని మీనింగ్ వచ్చేలా ఏదో ట్రై చేశారు. ఇటీవలే హాయ్ నాన్న వేడుకలో కేవలం ఫోటోలు చూపించినందుకే ఎంత రచ్చ జరిగిందో చూశాం. ఇక్కడ ఏకంగా పేర్లే చెప్పేశారు. తర్వాత పవిత్ర లోకేష్ తో ఈ వయసులో విజయనిర్మల గారి అబ్బాయికి పెళ్లి ఎందుకని అడిగించడం, దానికి బదులుగా నితిన్ జయంలోని ఎవరు ఏమన్నా ఆగదు ఈ ప్రేమ పాటను జెండాతో సహా పాడటం వీళ్ళ బంధం మీద ఆసక్తి ఉన్నవాళ్లకు కనెక్ట్ అయిపోయింది.

దర్శకుడు వక్కంతం వంశీ ఇంత ఓపెన్ గా వైరల్ టాపిక్స్ ని తీసుకోవడం విశేషమే. ఇదొక్కటే కాదు ఇంటర్వల్ ముందు ఫైట్ లో థర్టీ ఇయర్స్ పృథ్విని ఉద్దేశించి నితిన్ వెనుక నుంచి పట్టుకుంటావా అని వ్యంగ్యంగా అడగటం కూడా దేని గురించో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ ఆడియన్స్ కి ఎంత మేరకు కనెక్ట్ అవుతాయనే దాన్ని బట్టే ఎక్స్ ట్రాడినరి మ్యాన్ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. టాక్స్, రివ్యూస్ మిశ్రమంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఫైనల్ గా నితిన్ కోరుకున్న విజయం దక్కుతుందో లేదో సోమవారానికి తేలిపోతుంది. ప్రస్తుతం తను ప్రమోషన్ కోసం యుఎస్ లో ఉన్నాడు.