తారక్ సోదరులతో నెట్ ఫ్లిక్స్ సీఈఓ భేటీ

నిన్న హైదరాబాద్ పర్యటనకు వచ్చిన నెట్ ఫ్లిక్స్ సిఈఓ టెడ్ సరండోస్ చిరు ఫ్యామిలీతో భేటీ జరిపి మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లతో కలిసి ముచ్చటించిన ఫోటోలు వైరలైన సంగతి తెలిసిందే. తాజాగా కొమరం భీమ్ ని కలిశారు టెడ్. ఇవాళ మధ్యాన్న భోజనానికి జూనియర్ ఎన్టీఆర్ ఆహ్వానం మీద టీమ్ తో సహా అక్కడికి వెళ్లి సమావేశం కావడం అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. ఆర్ఆర్ఆర్ స్టార్లలో ఒకరిని కలిసి ఇంకొకరిని కలుసుకోకపోవడం పట్ల కొందరు ఫ్యాన్స్ ఎలాంటి అర్థాలు తీస్తారో సోషల్ మీడియా జనాలకు అలవాటైన వ్యవహారమే.

తారక్ తో పాటు అన్నయ్య కళ్యాణ్ రామ్, దేవర దర్శకుడు కొరటాల శివ కూడా ఈ మీటింగ్ లో పాలు పంచుకున్నాడు. ఏ విషయాలు చర్చించారు. ఏ ప్రతిపాదనలు డిస్కస్ చేసుకున్నారు లాంటివేవి ప్రస్తుతానికి బయటికి రాలేదు. టెడ్ మాత్రం టాలీవుడ్ సెలబ్రిటీస్ ని కలుసుకోవడం సీరియస్ అజెండాగా పెట్టుకున్నారు. ట్రిపులార్ స్టార్స్ ని కలుసుకున్నప్పుడు దర్శకుడిని మాత్రం వదులుతారా. రేపు రాజమౌళితో మీటింగ్ ఉండే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షత్, కాల భైరవల కలయికకు కూడా ఈ సందర్భంగా చూసుకోవచ్చు.

అసలు టెడ్ ముందు హైదరాబాద్ ఎందుకు వచ్చాడనేది మాత్రం బయటికి రావడం లేదు. ఇండియాలో సబ్స్క్రైబర్స్ ని పెంచుకునే అంశం గురించి ఇక్కడి టీమ్ తో సీరియస్ మంతనాలు జరగబోతున్న నేపథ్యంలో పలువురు స్టార్లను కలవడం ద్వారా వాళ్ళ పల్స్, అంచనాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడట. పనిలో పనిగా నెట్ ఫ్లిక్స్ నిర్మించబోయే భారీ బడ్జెట్ సినిమాలు, వెబ్ సిరీస్ లో భాగమయ్యేందుకు తారక్, చరణ్ లకు ఆహ్వానం ఇచ్చాడని ఇన్ సైడ్ టాక్. చూస్తుంటే రాబోయే నెలల్లో ఆసక్తి రేపే పలు ఆసక్తికరమైన అనౌన్స్ మెంట్లు ఉండే అవకాశాన్ని కొట్టి పారేయలేం.