కెజిఎఫ్ 3 అంత సులభం కాదు

సలార్ విడుదలకు ఇంకో రెండు వారాలు మాత్రమే ఉండటంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ బయటికొచ్చి మీడియాతో మాట్లాడుతున్నాడు. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి కూడా కొన్ని హింట్స్ ఇస్తున్నాడు. కెజిఎఫ్ 3 స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని, అయితే ఎప్పుడు తెరకెక్కించేది చెప్పలేనని అనడం యష్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. గీతూ మోహన్ దాస్ తో తన 19వ సినిమాని రేపు అఫీషియల్ గా ప్రకటించబోతున్న రాకింగ్ స్టార్ కి ఇది ఇరవై చిత్రం అవుతుందా లేక ఇంకా వెయిట్ చేయాలా అనేది సస్పెన్సే. అయితే కెజిఎఫ్ 3 ఏదో ఫ్లోలో చెప్పేసినంత సులభం కాదు.

ఎందుకంటే ప్రశాంత్ నీల్ ముందు జూనియర్ ఎన్టీఆర్ స్క్రిప్ట్ పనులు పూర్తి చేయాలి. 2024 సెట్స్ పైకి వెళ్లేందుకు మైత్రి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. దేవర 1 పూర్తి చేసుకుని వచ్చాక తారక్ టైంకి అనుగుణంగా వార్ 2 తో పాటు ప్రశాంత్ నీల్ మూవీ షెడ్యూల్స్ ని సమాంతరంగా ప్లాన్ చేసుకుంటాడు. ఇది వేగంగా పరిగెత్తే కాంబినేషన్ కాదు కాబట్టి 2025 సమ్మర్ కో లేదా అంతకన్నా ఆలస్యంగానో షూటింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత రామ్ చరణ్ తో నీల్ కాంబో ఉండొచ్చనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇదంతా పక్కనపెడితే అసలైన సలార్ 2 బాధ్యత ముందుంది.

చూచాయగా వేరే దర్శకుడితో కెజిఎఫ్ 3 తీయించే సూచన ఇచ్చిన ప్రశాంత్ నీల్ ఒకవేళ అదే చేస్తే మాత్రం పోలికల పరంగా ఇబ్బంది వస్తుంది. తేడా కొడితే విమర్శల వర్షం కురుస్తుంది. లేదూ వర్కౌట్ అయితే హ్యాపీనే. అయితే అంత బరువును మోసే శిష్యుడు తనకు ఎవరున్నారనేదే పెద్ద ప్రశ్న. ఈ ఎంపిక చాలా కష్టం. ఏది జరిగినా రెండు మూడేళ్ళలోపే ఫిక్స్ చేసుకుంటే బెటర్. లేట్ అయ్యేకొద్దీ కెజిఎఫ్ బ్రాండ్ మీద ముందు ఉన్నంత క్రేజ్ రాకపోవచ్చు. పైగా ఆర్ఆర్ఆర్ లాగా అదేమీ అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుని ప్రపంచ ఆడియన్స్ మెచ్చుకున్న మూవీ అంతకన్నా కాదు.