రష్మిక మందన్న లెక్కలన్నీ తేలినట్టే

ఛలోతో ఎంట్రీ ఇచ్చి తెలుగులో బ్లాక్ బస్టర్ డెబ్యూ అందుకున్న రష్మిక మందన్నకు గీత గోవిందం మరో పెద్ద బ్రేక్ ఇచ్చింది. మధ్యలో ఒకటి రెండు పోయినా భీష్మ, సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్స్ దక్కాక పుష్ప ఊహించని మలుపుతో టాప్ హీరోయిన్ కుర్చీ వైపు పరుగులు పెట్టించింది. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. వీటికి ముందు వెనుక దేవదాస్, డియర్ కామ్రేడ్, పొగరు, సుల్తాన్, ఆడవాళ్ళూ మీకు జోహార్లు ఇవేవి ఆశించిన స్థాయిలో ఆడక మార్కెట్ ని దెబ్బ తీశాయి. మరోవైపు కృతి శెట్టి, శ్రీలీల,మృణాల్ ఠాకూర్ లాంటి కొత్తమ్మాయిల జోరు బ్రేకులు వేసింది.

సీతారామం ఎంత పెద్ద విజయం సాధించినా తను అందులో మెయిన్ హీరోయిన్ కాకపోవడంతో క్రెడిట్ దక్కలేదు. హిందీ డెబ్యూ గుడ్ బై, దాని తర్వాత మిషన్ మజ్ను రెండూ డిజాస్టర్లే. తమిళంలో విజయ్ లాంటి స్టార్ హీరోతో వారసుడు చేస్తే వసూళ్లు వచ్చాయి కానీ ప్రశంసలు రాలేదు. ఇప్పుడు యానిమల్ ఆ లెక్కలన్నీ సరిచేసేలా ఉంది. రన్బీర్ కపూర్ భార్యగా ఇందులో పెర్ఫార్మన్స్ ఇవ్వగలిగే ఛాన్స్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా. పరిణితి చోప్రాని ముందు ఎంచుకుని తర్వాత వద్దనుకుని మరీ బెంగళూరు భామకు ఓటేశాడు. దానికి తగ్గ అవుట్ ఫుట్ స్క్రీన్ మీద కనిపిస్తోంది.

ఫైనల్ బాక్సాఫీస్ రిజల్ట్ కి ఇంకా టైం ఉంది కానీ రష్మిక మందన్నలో అసలు నటి హిందీ జనాలకు దీని ద్వారానే పరిచయమయ్యింది. ఎలాగూ పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్ట్ లో రిలీజవుతుంది. అందులోనూ స్కోప్ ఉన్న క్యారెక్టరే. రైన్బోతో సహా రెండు ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేతిలో ఉన్నాయి. మూడు నాలుగు బాలీవుడ్ ప్రొడక్షన్ సంస్థలు ఆల్రెడీ ఆఫర్లు ఇచ్చాయని తెలిసింది. ప్రభాస్ స్పిరిట్ లోనూ ఉండొచ్చనే వార్త ముంబైలో చక్కర్లు కొడుతోంది. ఈ లెక్కన కాస్త తగ్గులకు గురైన కెరీర్ ని మళ్ళీ ట్రాక్ లో పెట్టుకోవడానికి అవకాశం దక్కింది. దీన్ని ఇకపై నిలబెట్టుకోవడమే కీలకం.