ఓట్లు వేసే పండగలో టాలీవుడ్ సందడి

ఇవాళ తెలంగాణ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ బూతుల దగ్గర సందడి నెలకొంది. అయితే సామాన్య జనాల కన్నా సెలబ్రిటీలు ఓటేసే హడావిడే ఎక్కువగా కనిపించడం విశేషం. టాలీవుడ్ హీరోలు, నటీనటులు, దర్శకులు, నిర్మాతలు క్యూలలో నిలబడి ఇంకు మార్కు వేయించుకుని ఫోజులిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగార్జున, నాగ చైతన్య, శ్రీకాంత్, రోషన్, సుమంత్, కళ్యాణ్ రామ్, రవితేజ, రాజమౌళి, నితిన్, సుకుమార్, సాయి ధరమ్ తేజ్, అల్లు అరవింద్, మంచు మనోజ్, రామ్, సుకుమార్ తదితరులు త్వరగానే పూర్తి చేసుకున్నారు.

ఓటు వేసేందుకు మైసూర్ షెడ్యూల్ నుంచి బ్రేక్ తీసుకుని రామ్ చరణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇదంతా బాగానే ఉంది సగటు నగర వాసులు మాత్రం బద్దకిస్తున్న వైనం పోలింగ్ పర్సెంటేజ్ లో కనిపిస్తోంది. చిన్న పట్టణాలు, పల్లెటూళ్ళతో పోలిస్తే హైదరాబాద్ లోనే ట్రెండ్ నెమ్మదిగా ఉండటం విచారకరం. ఎన్నికల కమీషన్ అధికారికంగా సెలవు ప్రకటించినా దాన్ని ఓటు కోసం వినియోగించుకోకుండా విశ్రాంతి తీసుకోవడానికి వాడుకుంటున్న వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. పెద్దగా చెప్పుకునే సినిమాలు లేవు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే థియేటర్లు నిండుగా కనిపించేవేమో.

మాట్లాడకుండా చిరు మౌనవ్రతం తరహాలో ఓ జర్నలిస్టుతో మాట్లాడిన వీడియో, విజయ్ దేవరకొండ అభివృద్ధిని చూసి నిర్ణయం తీసుకోమని చెప్పడం, ఒక ఇన్స్ టాగ్రామ్ ఫాలోయర్ కి సెల్ఫీ వీడియో ఇచ్చి మరీ ఫాలోయర్స్ ని పెంచుకోమని అల్లు అర్జున్ చెప్పడం లాంటివి నెటిజెన్లను ఆకట్టుకుంటున్నాయి. సాయంత్రం దాకా టైం ఉంది కాబట్టి ఇంకే ఏమేం రాబోతున్నాయో చూడాలి. పోలింగ్ దెబ్బకు ఇవాళ కొత్త సినిమాల అప్డేట్లు, టీజర్ ట్రైలర్లు, పోస్టర్లు, వార్తలు లాంటివి ఏమి లేకుండా మొత్తం గప్ చుప్ గా ఉంటుంది. రేపు ఉదయం యానిమల్ షో నుంచి మళ్ళీ యథావిధిగా అంతా మామూలే.