కాంతార హీరో ప్రశ్నలు పంచులు

తక్కువ బడ్జెట్ లో సినిమా తీసి, కంటెంట్ తో మెప్పించి వందల కోట్ల గ్రాసర్ ఇచ్చిన హీరో కం దర్శకుడిగా రిషబ్ శెట్టికి దాని పుణ్యమాని మన దగ్గర కూడా గుర్తింపు వచ్చేసింది. రెండు వారాలు ఆలస్యంగా తెలుగులో రిలీజైనా అది సృష్టించిన సంచలనం ప్రేక్షకుల కన్నా ఎక్కువగా బయ్యర్లు అంత సులభంగా మర్చిపోలేరు. మొదటి భాగానికి కేవలం పదహారు కోట్లు ఖర్చు పెట్టిన హోంబాలే ఫిలింస్ ఇప్పుడీ సీక్వెల్ కి వంద కాదు అంతకు మించి ఎంతైనా సరే బడ్జెట్ ఇచ్చేందుకు సిద్ధపడింది. ఇటీవలే రిషబ్ శెట్టి 54వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా ప్రెస్ మీట్ లో మాట్లాడ్డం హాట్ టాపిక్ అయ్యింది.

పలు ప్రశ్నలకు సమాధానంగా మాట్లాడుతూ తాను కొందరి లాగా ఒక హిట్టు రాగానే కన్నడ సీమను వదిలిపోనని చెప్పడం ఆసక్తి రేపింది. ప్రత్యేకంగా ఫలానా పేర్లు ప్రస్తావించకపోయినా వాటిని నెటిజెన్లు దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరోయిన్ రష్మిక మందన్నకు ఆపాదిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం స్వంత బాష కంటే బయట సినిమాలతో బిజీ అయిపోయింది ఈ ఇద్దరే. నీల్ వరసగా ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లతో ప్లాన్ చేసుకోగా రష్మిక హిందీ, తెలుగు, నటించబోయే హీరోని బట్టి తమిళ సినిమాలు మాత్రమే చేస్తోంది. కాబట్టి ఈ అన్వయింపు వీళ్ళ గురించేనని కామెంట్.

ఇక ఓటిటిలు కన్నడ చిత్రాలను కొనడం లేదని చెప్పిన రిషబ్ శెట్టి ఇకపై క్వాలిటీ కంటెంట్ మీద అందరూ దృష్టి పెట్టాలని పిలుపునిచ్చాడు. నిజానికి ఈ సమస్య ఉంది. తెలుగు, తమిళంలాగా కాకుండా వాటి రీచ్ తక్కువ కావడంతో ఓటిటిలు అంతగా ఆసక్తి చూపించడం లేదు. కెజిఎఫ్, కాంతారా, 777 చార్లీ తర్వాత మార్కెట్ రేంజ్ పెరిగినప్పటికీ వాటికి సరితూగే సినిమాలు చేయడంలో ఇతర హీరోలు తడబడుతున్నారు. పైగా ఓవర్సీస్ మార్కెట్ లో ఎవరికీ గ్రిప్ లేదు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే నాణ్యత పెరగాలి. తమ పరిశ్రమను చూసే దృక్పథంలోనూ మార్పు రావాలనేది రిషబ్ శెట్టి ప్రశ్న.