‘కేజీఎఫ్’కు రాజమౌళి చేసిన సాయం

‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో ఆ స్థాయి విజయం సాధించిన సినిమా అంటే ‘కేజీఎఫ్’యే. సౌత్ ఇండియాలో క్వాలిటీ పరంగా మిగతా వాటి కంటే దిగువన ఉండే కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇలాంటి సినిమా వస్తుందని.. ఇలా ఇతర భాషల వాళ్లను ఉర్రూతలూగించి పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్‌బస్టర్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.

ఐతే ఈ సినిమాకు విడుదలకు ముందే బజ్ రావడానికి.. తెలుగు, హిందీ భాషల్లో బిజినెస్ కావడానికి మన దర్శక ధీరుడు రాజమౌళి సాయం చేశాడట. ఇది ఆశ్చర్యంగా అనిపించొచ్చు కానీ.. నిజం. ఈ విషయాన్ని ‘కేజీఎఫ్’ హీరో యశ్‌యే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

‘కేజీఎఫ్’లో రాకీ పాత్ర తెగ నచ్చేసి ఆ పాత్ర కోసం ఎంతో కష్టపడి తయారయ్యానని.. ముందుగా కొన్ని సీన్లు తీశామని.. అవి చూశాక కాన్ఫిడెన్స్ వచ్చిందని.. అలాంటి సందర్భంలో రాజమౌళిని కలవడం సినిమాకు చాలా మేలు చేసిందని యశ్ వెల్లడించాడు.

తమ సినిమా మేకింగ్ చర్చల్లో భాగంగా బెంగళూరులోని ఓ హోటల్లో ఉండగా.. అక్కడికి అనుకోకుండా రాజమౌళి వచ్చారని.. దీంతో ఆయనకు తమ సినిమాలోని కొన్ని విజువల్స్ చూపించామని.. అవి ఆయనకు బాగా నచ్చాయని.. తమను అభినందించి ప్రోత్సహించారని.. దీంతో తమ ఆత్మవిశ్వాసం రెట్టింపైందని యశ్ వెల్లడించాడు. అంతటితో ఆగకుండా తెలుగు, హిందీ భాషల్లోనూ డిస్ట్రిబ్యూటర్లకు తమ సినిమా గురించి చెప్పి బిజినెస్ జరగడానికి సాయం చేశారని యశ్ తెలిపాడు.

తెలుగులో రాజమౌళి మిత్రుడే అయిన సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఆ చిత్రం అనూహ్యమైన వసూళ్లు సాధించింది. ఇక రాజమౌళి జడ్జిమెంట్‌ను నమ్మి హిందీ డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమా మీద పెట్టుబడి పెట్టి మంచి ఫలితాన్నందుకున్నారు. ఈ రకంగా ‘కేజీఎఫ్’ పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ సాధించడంలో మన రాజమౌళి పాత్ర కూడా ఉందన్నమాట.