మహేష్ అభిమానుల ఉత్సాహమే వేరు

ఇవాళ సాయంత్రం జరగబోయే యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మల్లారెడ్డి యూనివర్సిటీ రెడీ అవుతోంది. హీరో హీరోయిన్ తో పాటు అనిల్ కపూర్, బాబీ డియోల్ అందరూ ఈ వేడుకలో పాలు పంచుకోబోతున్నారు. ముఖ్య అతిథులుగా మహేష్ బాబు, రాజమౌళి రానున్నారని తెలియడంతో ఒక్కసారిగా అభిమానులు అలెర్టయిపోయారు. విపరీతమైన రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో కేవలం కాలేజ్ విద్యార్థులు, స్టాఫ్ కు మాత్రమే అనుమతి ఉంటుందనే మెసేజ్ రాత్రి నుంచి తెగ చక్కర్లు కొడుతోంది. అదేమీ లేదని ఎవరైనా హాజరు కావొచ్చని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.

అయినా సరే ఎందుకైనా మంచిదేనని మల్లారెడ్డి స్టూడెంట్స్ గా లోపలి ప్రవేశించేందుకు కొందరు ఏకంగా ఐడి కార్డులు కూడా తయారు చేయించుకోవడానికి సిద్ధ పడటం అసలు ట్విస్టు. ఒకవేళ కామన్ పబ్లిక్ కి అనుమతి లేకపోతే లోపలికి ప్రవేశించడానికి ఇంతకన్నా మార్గం లేదు. ఇంత ఎగ్జైట్ అవ్వడానికి కారణాలున్నాయి. రన్బీర్, సందీప్, రష్మిక, అనిల్ కపూర్ లు మహేష్ గురించి చెప్పే నాలుగు మాటలు లైవ్ లో చూస్తేనే కిక్ వస్తుంది. అదే స్టేజి మీద రాజమౌళి ఉంటారు కాబట్టి వీళ్ళ కాంబినేషన్ లో రూపొందబోయే ప్యాన్ వరల్డ్ మూవీ గురించి ఏదైనా చెప్తారనే ఆశ మరొక రీజన్.

ఇవి కాకుండా యానిమల్ గురించి మహేష్ చెప్పబోయే విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఒక్కడు టైంలో ఆ సినిమాని రన్బీర్ చూసిన వైనం, రష్మికతో సరిలేరు నీకెవ్వరు జ్ఞాపకాలు, వీటితో పాటు జక్కన్న గురించి ఓ రెండు ముక్కలు, చివరిగా యానిమల్ మీద తనకున్న అంచనాలు ఇవన్నీ ప్రత్యక్షంగా చూస్తేనే మజా అనేది ఫ్యాన్స్ అభిప్రాయం. విశాలమైన మైదానంలో చేస్తున్నప్పటికీ అందరికీ పర్మిషన్లు ఇస్తే మాత్రం చోటు సరిపోయేలా లేదు. ఎంత ఐడి నిబంధన పెట్టినా ఒరిజినల్, నకిలీలను పసిగట్టడం అంత సులభం కాదు. సినిమా రేంజ్ లో హడావిడి ఈవెంట్ కి రావడం మహేష్ వల్లనే.