డబుల్ ఇస్మార్ట్.. టెన్షన్ తీరిపోయింది

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గత దశాబ్ద కాలంలో తీసిన ఏకైక హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా ఆయన కూడా ఊహించని స్థాయిలో బ్లాక్‌బస్టర్ అయింది. కానీ దీని తర్వాత పూరి నుంచి వచ్చిన ‘లైగర్’ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. దీంతో పూరి మళ్లీ పూర్వపు స్థితికే చేరాడు. ‘లైగర్’ నష్టాలను సెటిల్ చేయడంలో ఆయనకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి తప్పలేదు. ఆ సమస్య పూర్తిగా పరిష్కారం కాకముందే ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్’ను ఆయన పట్టాలెక్కించాడు.

ఈ సినిమా నుంచి వచ్చే ఆదాయంతో ‘లైగర్’ నష్టాలను సెటిల్ చేసేలా ఆయన బయ్యర్లకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘డబుల్ ఇస్మార్ట్’ మీద అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్‌యే ఉంది. విలన్‌గా సంజయ్ దత్ రాకతో ఈ సినిమాకు క్రేజ్ పెరిగింది. కాకపోతే అభిమానులను ఒక విషయం మాత్రం టెన్షన్ పెడుతూ వచ్చింది.

‘ఇస్మార్ట్ శంకర్’కు అదిరిపోయే పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో మంచి క్రేజ్ తీసుకొచ్చిన మణిశర్మ ‘డబుల్ ఇస్మార్ట్’కు దూరంగా ఉండటం చాలామందికి రుచించలేదు. వేరే సంగీత దర్శకుడిని పెట్టుకుంటే న్యాయం చేయగలరా అన్న ప్రశ్న తలెత్తింది. నిజానికి ‘ఇస్మార్ట్ శంకర్’ మొదలైనపుడు పెద్దగా హైప్ లేదు. దానికి బజ్ తెచ్చింది మణిశర్మ పాటలే. అవి ఒక ఊపు ఊపేయడంతో రిలీజ్ టైంకి మాంచి హైప్ వచ్చింది. అది దృష్టిలో ఉంచుకునే ‘డబుల్ ఇస్మార్ట్’కు మణిశర్మను దూరం పెట్టడం అభిమానులకు రుచించలేదు.

మణిశర్మను ఈ ప్రాజెక్టులోకి తీసుకోవాలని సోషల్ మీడియాలో చాలామంది పూరి, రామ్‌లకు విన్నపాలు చేశారు. ఆ ఫీడ్ బ్యాక్ చూశారా, మామూలుగానే అనిపించిందా అన్నది తెలియదు కానీ.. ఎట్టకేలకు మణిశర్మనే ఈ మూవీకి సంగతత దర్శకుడిగా తీసుకున్నారు. దీంతో ఫ్యాన్స్ టెన్షన్ తీరిపోయింది. ‘ఇస్మార్ట్ శంకర్’కు ఇచ్చినట్లే మణి మాంచి పాటలు, ఆర్ఆర్ ఇచ్చాడంటే ఈ సినిమా సగం సక్సెస్ అయిపోయినట్లే.