బన్నీ-త్రివిక్రమ్.. వేరే లెవెల్

దాదాపు నాలుగేళ్లుగా ‘పుష్ప’ సినిమాకే అంకితమైపోయి ఉన్నాడు అల్లు అర్జున్. 2019 చివర్లో ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని పూర్తి చేసిన అతను.. అప్పట్నుంచి ‘పుష్ప’ మీదే పని చేస్తున్నాడు. ముందు ఒక పార్ట్‌గా అనుకున్న సినిమా రెండు భాగాలైంది. ఒక పార్ట్ పూర్తి చేసి రిలీజ్ చేయడానికే చాలా టైం పట్టింది. సెకండ్ పార్ట్ మొదలు కావడంలో.. అలాగే చిత్రీకరణలోనూ చాలా ఆలస్యం జరుగుతోంది. వచ్చే ఏడాది ఆగస్టు 15కు ఆ సినిమా షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా రిలీజ్ తర్వాత థియేట్రికల్ రన్ ముగిసేవరకు బన్నీ బిజీగానే ఉంటాడు.

అంటే దాదాపు ఐదేళ్ల పాటు ‘పుష్ప’కే తన కెరీర్‌ను ఇచ్చేశాడన్నమాట బన్నీ. కానీ టైం పెడితే పెట్టాడు కానీ.. ఈ సినిమాతో బన్నీకి వచ్చిన ఫాలోయింగ్, మార్కెట్ ఎలాంటిదో తెలిసిందే. అతను రాజమౌళి అండ లేకుండా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.

‘పుష్ప’ తర్వాత బన్నీ ఏ సినిమా చేసినా.. ఒక రేంజిలో ఉండాల్సిందే. పాన్ ఇండియా అప్పీల్ అన్నది త్పనిసరి. ఐతే బన్నీ తన తర్వాతి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో కమిట్ కాగా.. ఆయన ఇప్పటిదాకా పాన్ ఇండియా టచ్ ఉన్న సినిమాలు తీయలేదు. దీంతో బన్నీ ఇమేజ్‌ను త్రివిక్రమ్ మ్యాచ్ చేయగలడా అనే సందేహాలున్నాయి.

దీనికి అల్లు అర్జున్ స్నేహితుడు, బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో నిర్మాణ భాగస్వామి అయిన బన్నీ వాసు ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. బన్నీతో త్రివిక్రమ్ సినిమా కచ్చితంగా పాన్ ఇండియా అప్పీల్ ఉన్నదే అని సంకేతాలు ఇచ్చాడు. ఇది ఫాంటసీ టచ్ ఉన్న సినిమా అని.. ఇప్పటిదాకా బన్నీ-త్రివిక్రమ్ కెరీర్లలో బిగ్గెస్ట్ మూవీ ఇదే అవుతుందని అతను చెప్పాడు. ఈ సినిమా ప్రి ప్రొడక్షన్‌కు మాత్రమే ఏడాదిన్నర సమయం పడుతుందని చెప్పాడు. ఈ మాటలు ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేవే. ప్రస్తుతం త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’ పనిలో బిజీగా ఉన్నాడు. ఆయన జనవరికి ఖాళీ అవుతాడు. అక్కడి నుంచి ఏడాదిన్నర అంటే 2025 మధ్యలో కానీ ఈ సినిమా మొదలు కాదన్నమాట. అంటే మధ్యలో బన్నీ ఇంకో సినిమా చేసుకోవడానికి కూడా స్కోప్ ఉన్నట్లే.