కార్తీ ఇంత అవమానం ఊహించలేదు  

ఏ హీరోకైనా మైలురాయి సినిమాలు గొప్ప జ్ఞాపకాలుగా మిగిలిపోవాలని కోరుకుంటారు. కార్తీ కూడా ఇరవై అయిదవ మూవీ జపాన్ కు అలాగే అనుకుని దర్శకుడు రాజు మురుగన్ ని గుడ్డిగా నమ్మిన వైనం నిండా ముంచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఫైనల్ రన్ ఇంకా దూరముండగానే 25 కోట్ల గ్రాసే అతి కష్టం మీద దాటి ఎదురీదుతోంది. అర్థం లేని కథా కథనాలతో, ఏ మాత్రం ఆసక్తి గొలపని స్క్రీన్ ప్లేతో ఆటాడిన తీరు బాక్సాఫీస్ వద్ద తిరస్కారం ఎదురయ్యేలా చేసింది. అదే రోజు పోటీగా వచ్చి మార్నింగ్ షోలకు పెద్దగా జనం లేకపోయిన జిగర్ తండా డబుల్ ఎక్స్ అనూహ్యంగా 50 కోట్ల మార్కుని అందుకుంది.

ఇది కార్తీ ఊహించని పరిణామం. తనకు చాలా పేరు తీసుకొస్తుందని ఎంతో నమ్మకంతో విపరీతమైన ప్రమోషన్లు చేశాడు. అన్నయ్య సూర్యని పట్టుకొచ్చి, తనతో పని చేసిన దర్శకులందరినీ గెస్టులుగా తీసుకొచ్చి చెన్నైలో గ్రాండ్ ఈవెంట్ చేయడం మీడియాలో బాగా హైలైట్ అయ్యింది. తెలుగు వెర్షన్ కోసం హైదరాబాద్ లో నాలుగైదు రోజులు ఉండి ఈవెంట్లు, ఇంటర్వ్యూలు చేసుకున్నారు. ఇంత చేసినా లాభం లేకపోయింది. కార్తీ మ్యానరిజం తప్ప సినిమా మొత్తంలో పాజిటివ్ గా చెప్పుకునే అంశం ఒక్కటంటే ఒక్కటి లేకపోవడంతో తమిళనాడులో చాలా థియేటర్లలో జపాన్ తీసేశారు.

పొన్నియిన్ సెల్వన్ ఇచ్చిన ఆనందం ఈ విధంగా ఆవిరయ్యిందన్న మాట. అయినా కొందరు హీరోలు కథ వినగానే ముందు వెనుకా ఆలోచించకుండా గుడ్డిగా ఒప్పేసుకుని తీరా ఫలితం చూశాక బాధ పడటం ఈ మధ్య పరిపాటిగా మారింది. జపానే దానికి మంచి ఉదాహరణ. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు తమిళంలో కంటే తెలుగులోనే రెండో వారం కాస్త బెటర్ గా థియేటర్లు కంటిన్యూ అవుతున్నాయి. ఇలాంటివి కాదు కానీ వీలైనంత త్వరగా ఖైదీ 2తో మరోసారి విశ్వరూపం చూపించమని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. కార్తీ రెడీగా ఉన్నాడు కానీ అవతల లోకేష్ కనగరాజ్ ఓకే చెప్పాలిగా. అందుకే ఆలస్యం.