అదుర్స్ కొంచెం ఆగి రావాల్సింది

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ ఎంటర్ టైనర్స్ లో ఒకటిగా నిలిచిన అదుర్స్ రీ రిలీజ్ ఈ శనివారం జరగనుంది. బుక్ మై షో తదితర యాప్స్ లో బుకింగ్స్ మొదలుపెట్టారు. అయితే ఆశించిన స్పందన లేదని అమ్మకాలు చూస్తే అర్థమవుతోంది. హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్, వైజాగ్ తదితర ముఖ్యమైన ప్రాంతాలు మినహాయించి మిగిలిన చోట్ల రెస్పాన్స్ డల్లుగానే ఉంది. దీనికి కారణాలు స్పష్టం. జనాలు రీ రిలీజులతో విసుగెత్తిపోయి ఉన్నారు. నెలకు మూడు నాలుగు పాత సినిమాలు పనికట్టుకుని థియేటర్లలో రిలీజ్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ టికెట్లు కొనేందుకు స్థోమత, ఆసక్తి రెండూ సహకరించడం లేదు.

ఈ ట్రెండ్ కి కొంత కాలం బ్రేక్ వేస్తే భవిష్యత్తులో పుంజుకుంటుందని మూవీ లవర్స్ మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు అయినా ఫ్యాన్స్ గుడ్డిగా వచ్చేస్తారనే లెక్కలో వరసబెట్టి హక్కులు కొనేస్తున్నారు. మొదట్లో లక్షల్లో ఉన్న రైట్స్ వ్యవహారం ఇప్పుడు కోట్లకు చేరుకుంది. పోనీ పెట్టుబడికి గ్యారెంటీ ఉందా అంటే అదీ లేదు. నగరాల్లో వచ్చిన లాభాలు పట్టణాల్లో వచ్చిన డెఫిషిట్లను కవర్ చేయడానికి సరిపోతుంటే ఇక మిగిలిదేముంది. ప్రారంభంలో పోకిరి, ఖుషి, ఆరంజ్ లాంటివి కనక వర్షం కురిపించిన మాట వాస్తవమే కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.

కొంతకాలం ఆగి దేవరకు ముందు అదుర్స్ రీ రిలీజ్ చేసి ఉంటే బాగుండేదని తారక్ ఫ్యాన్స్ అభిప్రాయం. సరైన సమయం, సందర్భం లేకుండా ప్లాన్ చేసుకుంటే ఫలితాలు ఇంకా చేదుగా మారిపోతాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఆ మధ్య శంకర్ దాదా ఎంబిబిఎస్ ని ఇలాగే వృథా చేసుకున్నారు. పైగా సెప్టెంబర్ నుంచి బాక్సాఫీస్ కొంచెం డ్రైగానే నడుస్తోంది.  కొత్త సినిమాల్లో భగవంత్ కేసరి, లియో లాంటి రెండు మూడు మినహాయించి మేజిక్ చేసినవి పెద్దగా లేవు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే ముత్తు, శివాజీ, వెంకీలకు ఏం జరుగుతుందో చూడాలి. ఇదంతా గమనించే నువ్వు నాకు నచ్చావ్ ని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు.