మళ్లీ నందమూరి బాబాయ్-అబ్బాయ్ క్లాష్?

ఒక ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ దగ్గర తలపడటం అరుదు. నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌ల మధ్య ఒకసారి ఇలాంటి క్లాష్ జరిగింది. 2016 సంక్రాంతికి అనివార్య పరిస్థితుల్లో బాలయ్య సినిమా ‘డిక్టేటర్’, తారక్ మూవీ ‘నాన్నకు ప్రేమతో’ను ఒక్క రోజు గ్యాప్‌లతో రిలీజ్ చేశారు. ఆ టైంలో నందమూరి అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి గొడవ పడటం కనిపించింది.

అందుకు రాజకీయ కారణాలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆ టైంలో తారక్ మూవీ స్పష్టమైన పైచేయి సాధించింది. ఆ తర్వాత మళ్లీ బాబాయ్-అబ్బాయ్ మధ్య బాక్సాఫీస్ పోరు చూడలేదు. ఐతే వచ్చే ఏడాది వేసవికి మళ్లీ నందమూరి హీరోల పోరు చూడబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ తారక్ మూవీ ‘దేవర’ను 2024 ఏప్రిల్ 5కు షెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందుతున్న ‘దేవర’లో ఫస్ట్ పార్ట్ ఆ రోజే రిలీజవుతుంది.

‘దేవర-1’ ఏప్రిల్ 5 రిలీజ్ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని.. తాజాగా 150 రోజుల కౌంట్‌డౌన్ పోస్టర్‌తో టీం క్లారిటీ ఇచ్చింది. కాగా బాలయ్య ఇప్పుడే తన కొత్త చిత్రాన్ని మొదలుపెడుతున్నాడు. బాబీ దర్శకత్వంలో బాలయ్య కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతున్న విషయాన్ని అధికారికంగానే ప్రకటించింది చిత్ర బృందం. చిత్రీకరణలో బాలయ్య స్పీడు గురించి తెలిసిందే. బాబీ కూడా పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగుతున్నాడు.

వేసవి రిలీజ్ లక్ష్యంగా ఈ చిత్రాన్ని వేగంగా పూర్తి చేయడానికి సితార ఎంటర్టైన్మెంట్స్ షెడ్యూల్స్ వేసుకుంది. బాలయ్య ఫిబ్రవరి నుంచి ఎన్నికల పనిలో బిజీ అయ్యే అవకాశముంది. ఆలోపు సినిమాను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. జనవరి నెలాఖరుకు షూటింగ్ పూర్తి చేసి ఇంకో రెండు నెలల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నారట. మార్చి 29న సినిమాను రిలీజ్ చేసి వేసవి సీజన్‌ను ఘనంగా ఆరంభించాలని టీం చూస్తోందట. ఇదే నిజమైతే వారం వ్యవధిలో బాబాయ్-అబ్బాయ్ సినిమాలు రిలీజై నందమూరి అభిమానుల్లో మరోసారి కలకలం రేపడం ఖాయం.