కాఫీకి వెళ్లే ప్రసక్తే లేదన్న నాని

న్యాచురల్ స్టార్ నాని వివాదాలకు ఎంత దూరంగా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఒకవేళ అలాంటి సూచన కనిపించినా ఆ జాడలకు వెళ్లకుండా జాగ్రత్త పడతాడు. తాజాగా ఇండియా టుడే నిర్వహించిన రౌండ్ టేబుల్ కాంక్లేవ్ కు ప్రత్యేక అతిధిగా హాజరైన నాని ఒకవేళ కాఫీ విత్ కరణ్ టాక్ షోకి ఆహ్వానం వస్తే నిర్మొహమాటంగా నో చెబుతానని చెప్పేశాడు. అయితే సున్నితంగానే తిరస్కరిస్తాను తప్పించి అంతకు మించి ఇంకేం లేదన్నాడు. కరణ్ ఫోన్ చేస్తాడని, ఒకవేళ కలిసే సందర్భం వచ్చినా సంతోషంగా సినిమా కబుర్లు చెప్పుకుని బయటికి వస్తాను తప్పించి నో కెమెరా అని స్పష్టత ఇచ్చాడు.

నాని ఇంత ఓపెన్ గా బాలీవుడ్ బిగ్గెస్ట్ టాక్ షో గురించి ఇలా చెప్పడం విశేషమే. ఎందుకంటే ఈ మధ్య పలువురు ఈ ప్రోగ్రాంకి వెళ్లి సోషల్ మీడియాకు మీమ్స్ మెటీరియల్ గా మారారు. ముఖ్యంగా రణ్వీర్ సింగ్, దీపికా పదుకునేల ఎపిసోడ్ ఆన్ లైన్ లో పెద్ద డిబేట్ కు దారి తీసింది. ఆమె గత జీవితంలోని బాయ్ ఫ్రెండ్స్ గురించి కరణ్ అడిగిన విధానం గురించి నెటిజెన్లు పెద్ద ఎత్తున చర్చించుకున్నారు. ఇలాంటివి గతంలోనూ జరిగాయి. కరణ్ ఎక్కువ వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసేందుకు ప్రయత్నిస్తాడు. ఆ ట్రాప్ లో పడ్డవాళ్ళు మాత్రం అనుకోకుండానే నిజాలు చెప్పేస్తారు.

జై భీంకు నేషనల్ అవార్డు రాకపోవడం పట్ల నాని మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశాడు. దానికి అన్ని అర్హతలు ఉన్నాయని, అయితే కమిటీ అలా ఎందుకు నిర్ణయం తీసుకుందో తెలియదనే రీతిలో చెప్పడం మూవీ లవర్స్ ని ఆలోచనలో పడేసింది. రామ్ చరణ్ తర్వాత ఇండియా టుడే నుంచి రౌండ్ టేబుల్ కి ఆహ్వానం అందుకున్న రెండో సెలబ్రిటీ నానినే. డిసెంబర్ 7న హాయ్ నాన్న విడుదల కాబోతున్న తరుణంలో ప్రమోషన్లలో విరివిగా పాల్గొంటున్న నాని ఈ నెల రోజులు దానికే ఎక్కువ సమయం కేటాయించబోతున్నాడు. ఆపరేషన్ వాలెంటైన్, గ్యాంగ్స్ అఫ్ గోదావరి, ఎక్స్ ట్రాడినరి మ్యాన్ తో పోటీ అలా ఉంది మరి.