త్రివిక్రమ్ కూడా మల్టీవర్స్ రెడీ చేస్తున్నాడా?

ఈ మధ్య అన్ని ఫిలిం ఇండస్ట్రీల్లోనూ ‘మల్టీవర్స్’ హంగామా నడుస్తోంది. ఒక దర్శకుడు తాను తీసే సినిమాల్లో ఒకదాంతో ఒకదానికి లింక్ పెట్టి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ట్రెండ్ మొదలుపెట్టింది తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్. ’విక్రమ్’ సినిమాలో ‘ఖైదీ’ సహా తాను తీసిన మిగతా సినిమాలకు కూడా లింకులు పెట్టి ఆడియన్స్‌కు గూస్ బంప్స్ ఇచ్చాడు. ‘లియో’లో కూడా ఆ టచ్ కొంచెం కనిపించింది.

లోకేష్ తీయబోయే తర్వాతి సినిమాల్లోనూ ఈ లింకులు కొనసాగే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ సైతం.. ‘సలార్’ను ‘కేజీఎఫ్’తో కనెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మిగతా దర్శకులు కూడా ఈ దిశగా ఆలోచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐతే త్రివిక్రమ్ ఇలాంటి ప్రయత్నం చేస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ ‘గుంటూరు కారం’లో ఆ టచ్ కనిపిస్తుండటం విశేషం.

నిన్ననే ‘గుంటూరు కారం’ నుంచి దమ్ మసాలా అంటూ సాగే తొలి పాటను రిలీజ్ చేశారు. అందులో కొన్ని దృశ్యాలు త్రివిక్రమ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘అరవింద సమేత’తో కనెక్ట్ అయ్యాయి. ‘అరవింద సమేత’లో శుభలేఖ సుధాకర్ రాజకీయ పార్టీ నేతగా కనిపిస్తాడన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రాతినిధ్యం వహించే పార్టీ గుర్తు ‘కాగడా’గా చూపిస్తారు.

‘గుంటూరు కారం’ పాటలో రెండు చోట్ల కాగడా గుర్తు కనిపిస్తుంది. ఒక షాట్‌లో మహేష్ బాబు కారు మీద కూడా ఆ గుర్తును చూడొచ్చు. ఇది చూసి ‘అరవింద సమేత’కు దీనికి కనెక్షన్ ఉందని.. ‘అరవింద సమేత’లో విలన్‌గా చేసిన జగపతిబాబే ఇందులోనూ నటిస్తుండటంతో త్రివిక్రమ్ ఏదో స్పెషల్‌గా ప్లాన్ చేశాడని నెటిజన్లు థియరీలు చెబుతున్నారు. మరి త్రివిక్రమ్ క్యాజువల్‌గా ఆ గుర్తును వాడాడా.. లేక నిజంగానే ఆయన కూడా ‘మల్టీవర్స్’ ట్రెండును అందిపుచ్చుకుంటున్నాడా అన్నది చూడాలి.