వరుణ్ లావ్ పెళ్లి హక్కులు 8 కోట్లా

సెలబ్రిటీ వెడ్డింగులంటే అభిమానుల్లో ఉండే క్రేజ్ వేరు. అందులోనూ మెగా ఫ్యామిలీ పెళ్లి వేడుకకు ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. ఇటీవలే ఇటలీలో జరిగిన ఈ సెలబ్రేషన్ తాలూకు వీడియోని తమ ఓటిటిలో స్ట్రీమింగ్ చేసేందుకు గాను నెట్ ఫ్లిక్స్ సంస్థ అక్షరాల 8 కోట్ల రూపాయలు చెల్లించిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ వార్త మాత్రం గట్టిగానే తిరుగుతోంది. అయితే పరిమిత అతిథుల మధ్య జరిగిన ఈ వేడుక మొత్తంలో చిరంజీవి, లావణ్య త్రిపాఠి, ఉపాసన, అల్లు కుటుంబ సభ్యులు తప్ప సెలబ్రిటీలు పెద్దగా కనిపించరు.

ఒక్క నితిన్ మాత్రమే స్నేహితుల కోటాలో వెళ్ళాడు. మరి అలాంటప్పుడు అంత భారీ వ్యూస్ వస్తాయా అంటే ఏమో చెప్పలేం. గతంలో నయనతార విగ్నేష్ శివన్ ఈవెంట్ ని సైతం నెట్ ఫ్లిక్స్ కొనేసిందనే టాక్ వచ్చింది. తీరా చూస్తే అది నిజం కాలేదు. షూట్ చేశారు కానీ ఏవో ఇతరత్రా కారణాల వల్ల స్ట్రీమింగ్ కి నోచుకోలేదు. వరుణ్ తేజ్ లావణ్యల ఘట్టానికి అలాంటి సమస్యేమీ రాకపోవచ్చు. అయితే వ్యూస్ మాత్రం ఏ మేరకు వస్తాయో చూడాలి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మిస్ చేయకుండా చూస్తారు కానీ మిగిలిన వాళ్ళ గురించి చెప్పలేం.

మొన్న జరిగిన రిసెప్షన్ కు చాలా మంది ప్రముఖులు హాజరు కాలేదు. వరుణ్ లావణ్యలతో సినిమాలు తీసిన కొందరు దర్శక నిర్మాతలు హైదరాబాద్ లోనే ఉన్నా రాకపోవడం గురించి చిన్నపాటి చర్చే జరిగింది. పిలిచేందుకు తగినంత సమయం లేకపోవడంతో నాగబాబు ఫోన్, వాట్సాప్ లోనే పిలుపులు కానిచ్చారని అందుకే హాజరులో ఆ ప్రభావం కనిపించిందనే కామెంట్స్ వినిపించాయి. ఇవి నిజమో కాదో కానీ నెట్ ఫ్లిక్స్ కనక నిజంగా కొనేసి ఉంటే వీలైనంత త్వరగా ప్రసారం చేయడం బెటర్. ఎక్కువ ఆలస్యం చేస్తే జనాల్లో ఆసక్తి తగ్గిపోయి ఆ ఏం చూస్తాంలే అని అనుకునే ప్రమాదం లేకపోలేదు.