మిస్టరీ థ్రిల్లర్స్ అంటే ఊగిపోతున్నారు

సినీ పరిశ్రమలో ఒక జానర్లో సినిమా మంచి విజయం సాధించిందంటే.. ఇక ఆ కోవలో వరుసగా సినిమాలు రెడీ అవుతుంటాయి. ఈ మధ్య టాలీవుడ్లో మిస్టరీ థ్రిల్లర్ల కథలు బాగా వర్కవుట్ అవుతున్నాయి. హార్రర్ సినిమాలు.. హార్రర్ కామెడీలు మొహం మొత్తేశాక.. వీటికి కొంచెం ట్విస్ట్ ఇచ్చి భిన్నంగా ఈ కథలను ప్రెజెంట్ చేస్తున్నారు ఫిలిం మేకర్స్. గత ఏడాది కన్నడ నుంచి వచ్చిన ‘కాంతార’ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.

ఆ చిత్రం తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. దీన్నుంచి స్ఫూర్తి పొందిన మన ఫిలిం మేకర్స్ కూడా హార్రర్ కథలను ‘కాంతార’ స్టయిల్లో డీల్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో వచ్చిన ‘విరూపాక్ష’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. దీంతో మిస్టరీ థ్రిల్లర్ల ఊపు మరింత పెరిగింది. తాజాగా ‘మా ఊరి పొలిమేర-2’ అనే చిన్న చిత్రం.. టాలీవుడ్ ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యపరుస్తోంది.

సత్యం రాజేష్ లాంటి క్యారెక్టర్ నటుడు లీడ్ రోల్ చేసిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర అనూహ్యమైన వసూళ్లు సాధిస్తోంది. ఓటీటీలో రిలీజైన ‘మా ఊరి పొలిమేర’కు కొనసాగింపుగా అనిల్ విశ్వనాథ్ రూపొందించిన ఈ చిత్రానికి అంత గొప్ప టాకేమీ రాకపోయినా మాస్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. మంచి ఆక్యుపెన్సీలతో రన్ అవుతోంది. ఈ సినిమా సక్సెస్ ఇదే నెలలో రాబోతున్న మరో మిస్టరీ థ్రిల్లర్ ‘మంగళవారం’ చిత్రానికి మంచి ఉత్సాహాన్నిచ్చేదే. దానికి కూడా ప్రేక్షకుల్లో మంచి హైప్ ఉంది. ఓపెనింగ్స్ బాగానే వచ్చేలా ఉన్నాయి. టాక్‌ను బట్టి ఓవరాల్ రిజల్ట్ ఉంటుంది.

అలాగే సందీప్ కిషన్ కూడా ఇదే తరహాలో ‘ఊరి పేరు భైరవకోన’ అనే సినిమా చేస్తున్నాడు. అది కూడా ‘విరూపాక్ష’ లాంటి సినిమాలా కనిపిస్తోంది. ఆల్రెడీ ఈ సినిమాలోని ‘నిజమే నే చెబుతున్నా’ పాటకు అదిరిపోయే స్పందన వచ్చింది. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయం. సినిమాలో విషయం ఉంటే అది కూడా పెద్ద హిట్టయ్యే అవకాశముంది.