ఆమెతో బ్రేకప్.. సుశాంత్ సింగ్ నిర్ణయమే

భారతీయ సినిమా ప్రేమికుల్ని అత్యంత బాధ పెట్టిన మరణాల్లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఒకటి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ‘యం.ఎస్.ధోని’ సహా పలు చిత్రాలతో యువ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ నటుడు.. ఆత్మహత్య చేసుకుని అర్ధంతరంగా తనువు చాలిస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. ముందు అతడిది అనుమానాస్పద మరణంగా భావించినప్పటికీ.. అందులో కుట్ర కోణం ఏమీ లేదని, సుశాంత్ తనకు తానే ప్రాణం తీసుకున్నాడని పోలీసులు తేల్చారు.

కెరీర్ ఆశాజనకంగానే ఉన్నప్పటికీ సుశాంత్ ఎందుకలా ప్రాణం తీసుకున్నాడన్నది అంతుబట్టని విషయంగానే మిగిలిపోయింది. అప్పటి అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మీద అనుమానాలు వ్యక్తమయ్యాయి కానీ.. తన పాత్ర ఏమీ లేదని వెల్లడైంది. సుశాంత్ గతంలో టీవీ నటుడిగా ఉన్న సమయంలో అంకితా లోఖండే అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. 

సుశాంత్ మరణించిన సమయంలో అంకితా గురించి కూడా పెద్ద చర్చ జరిగింది. రియాతో ఉన్నప్పటి కంటే అంకితాతో ప్రేమలో ఉన్నప్పుడే సుశాంత్ చాలా సంతోషంగా ఉన్నాడని మాట్లాడుకున్నారు సామాజిక మాధ్యమాల్లో. ఐతే తమ ప్రేమ విఫలం కావడంలో తన పాత్ర ఏమీ లేదని అంటోంది అంకితా. సుశాంతే అప్పట్లో బ్రేకప్ నిర్ణయం తీసుకున్నట్లుగా ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించింది.

‘‘మేమిద్దరం విడిపోవడానికి పెద్ద కారణం అంటూ ఏమీ లేదు. అతను విడిపోదాం అన్నపుడు నేను షాకయ్యా. రాత్రికి రాత్రే నా జీవితంలో పరిస్థితులన్నీ మారిపోయాయి. సుశాంత్ బ్రేకప్ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో నాకు తెలియదు. కానీ అతడి నిర్ణయాన్ని తప్పుబట్టాలని నేనెప్పుడూ అనుకోలేదు. ఆ తర్వాత వేరొకరితో రిలేషన్‌షిప్‌లోకి వెళ్లడానికి భయపడ్డా’’ అని అంకితా చెప్పింది. టీవీ సీరియళ్లలో నటించేటపుడు అంకితాతో ప్రేమలో ఉన్న సుశాంత్.. సినిమాల్లోకి వెళ్లి ఒక స్థాయి అందుకున్నాక అంకితకు దూరమైనట్లు బాలీవుడ్లో చర్చ నడిచింది.