తప్పించుకున్న స్టువర్టుపురం దొంగ

మాస్ మహారాజా మొదటిసారి బయోపిక్ చేసిన టైగర్ నాగేశ్వరరావు దసరా పండగ పుణ్యమాని ఓ మోస్తరు వసూళ్లు సాధించింది కానీ ఫైనల్ రన్ అయ్యేలోపు కనిష్టంగా పధ్నాలుగు కోట్ల దాకా నష్టం మిగల్చవచ్చని ట్రేడ్ టాక్. నిడివి గురించి వచ్చిన కామెంట్స్ దృష్టిలో పెట్టుకుని మూడో రోజే ఇరవై నిమిషాలకు పైగా కోత పెట్టడం వల్ల మేలు జరిగింది లేదంటే పరిస్థితి ఇంకా దిగజారేది. దీనికి తోడు భగవంత్ కేసరి, లియోలతో తలపడటం డ్యామేజ్ ఇంకా పెంచేసింది. దీనికి బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కున్న కనెక్షన్ అధిక శాతం మర్చిపోయి ఉండొచ్చు కానీ ఇక్కడో సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి.

టైగర్ నాగేశ్వరరావు ప్రకటించిన టైంలోనే ఇదే కథతో వేరే దర్శకుడితో స్టువర్ట్ పురం దొంగ టైటిల్ తో సాయిశ్రీనివాస్ ఓ భారీ చిత్రానికి రెడీ అయ్యాడు. దాని ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం ప్రత్యేకంగా మేకోవర్ చేసుకుని మరీ వీడియో వదిలారు. కట్ చేస్తే రెండు కథలు క్లాష్ అవుతుండటంతో పలు దఫాల చర్చల అనంతరం బయటికి చెప్పని కారణాలతో సాయిశ్రీనివాస్ ప్రాజెక్ట్ డ్రాప్ అయిపోగా రవితేజ సినిమా పట్టాలు ఎక్కింది. ఇప్పుడు చూస్తేనేమో మాస్ మహారాజాకు చేదు ఫలితం దక్కింది. ఒకవేళ బెల్లం హీరో కనక చేసుంటే ఎలా ఉండేదంటే ఇంత బరువుని మోసేవాడు కాదేమో.

అసలు టాలీవుడ్ కు ఈ స్టువర్ట్ పురం కాన్సెప్ట్ అంతగా అచ్చి రాలేదు. 1991లో చిరంజీవి హీరోగా యండమూరి వీరేంద్రనాథ్ తనే రాసిన నవలను స్వీయ దర్శకత్వంలో స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ గా తెరకెక్కించారు. అయితే అది దారుణంగా డిజాస్టర్ అయ్యింది. అదే సమయంలో భానుచందర్ తో స్టువర్ట్ పురం దొంగలుని దర్శకులు సాగర్ తీశారు. ఇది ఓ మాదిరి హిట్ అనిపించుకుంది. తర్వాత ఎవరూ ఈ బ్యాక్ డ్రాప్ ఎంచుకునే సాహసం చేయలేదు. క్రమంగా ఆ ఊరి పేరుకున్న నెగటివ్ మార్క్ కూడా చెరిగిపోయింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత టైగర్ నాగేశ్వరరావు వల్ల చర్చలోకి వచ్చింది. ఏదైతేనేం సాయిశ్రీనివాస్ సేఫయ్యాడు.