లియో థియరీలు ఆపండయ్యా స్వామీ

రెండు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో లియో థియేట్రికల్ రన్ తెలుగుతో సహా ఇతర భాషల్లో బాగా నెమ్మదించిపోయింది. తమిళంలోనూ వసూళ్ల తాకిడి తగ్గినప్పటికీ నిర్మాతలు మాత్రం ఆరు వందల కోట్లు దాటేసిందని చెబుతున్నారు. లెక్కల సంగతి కాస్త పక్కనపెడితే దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో పాటు దానికి పని చేసిన సాంకేతిక నిపుణులు, నటీనటులు ఏవేవో కొత్త థియరీలు చెప్పడం, వాటి మీద సోషల్ మీడియాలో విపరీత చర్చ జరిగేలా చేయడం ఒకరకంగా అతిగానే తోస్తోంది. తీసిందే హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో. దాని మీద ఇన్ని డిస్కషన్లు అవసరమా అనిపిస్తోంది.

స్టైలిష్ మేకింగ్ పరంగా లియో కంటెంట్ ని ఒప్పుకోవాల్సిందే. అలా కానీ కథ, కథనాలు, ట్విస్టులు గతంలో మనమెన్నడూ చూడనివి, విననివి కాదు. ఆ మాటకొస్తే బాషా, ఇంద్ర నుంచి ఇదే విజయ్ అదిరింది దాకా ఎన్నో వచ్చాయి. అయితే లియో ఫ్లాష్ బ్యాక్, మన్సూర్ అలీఖాన్ చెప్పిన గతం ఫేక్ అనే వివరణ, పార్తీబన్ నడిపే రెస్టారెంట్ కు విక్రమ్ లో కనిపించే వేశ్య ఎందుకొచ్చిందనే దాని గురించి లెక్చర్ ఇలా బోలెడు అంశాల గురించి లోకేష్ టీమ్ పదే పదే వివరణ ఇవ్వడం మోతాదు మించేస్తోంది. సినిమాటిక్ యునివర్స్ కాన్సెప్ట్ కి అభిమానుల మెదళ్లలోకి బలంగా ఎక్కించే ప్రయత్నమే ఇదంతా అని విశ్లేషకుల అభిప్రాయం.

మొన్నటి నుంచి లోకేష్ వరసబెట్టి పోస్ట్ రిలీజ్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. నిజాయితిగా సెకండ్ హాఫ్ ల్యాగ్ అయ్యిందని ఒప్పుకుంటున్నాడు కానీ అంతకు మించి లియో క్యారెక్టరైజేషన్ ని ఓవర్ ఎలివేట్ చేయడం పట్ల రకరకాల కామెంట్లు వచ్చి పడుతున్నాయి. ఇలా రంధ్రాన్వేషణ చేస్తే ప్రతి సినిమాలో ఎంత లోతుకైనా వెళ్లొచ్చు. నిన్న బేబీ దర్శకుడు సాయిరాజేష్ కలర్ ఫోటోతో కలిపి తమ బ్యానర్ నుంచి వచ్చిన రాబోయే లవ్ స్టోరీస్ ని యునివర్స్ చేసే ఆలోచన ఉందని చెప్పడం ఒకరకంగా వ్యంగ్యంగానే అనిపిస్తోంది. చూస్తుంటే ఓటిటిలో వచ్చే దాకా లియో టాపిక్ ని సాగదీసేలా ఉన్నారు.