దర్శకురాలు వెర్సస్ నెటిజన్లు

గత వీకెండ్లో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కొత్త చిత్రం.. మార్టిన్ లూథర్ కింగ్. పేరడీ, స్పూఫ్ సినిమాలు చేసుకునే సంపూర్ణేష్ బాబును ఒక సీరియస్ పాత్రలో చూపిస్తూ కొత్త దర్శకురాలు పూజా కొల్లూరు ఈ చిత్రాన్ని రూపొందించింది. ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహా ఇందులో ఓ కీలక పాత్ర చేయడంతో పాటు స్క్రిప్టు కూడా అందించాడు. ఐతే ఓటు విలువను తెలియజెప్పే ఒక మంచి సందేశాన్ని వినోదపు పూతతో చెప్పిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రావట్లేదు.

ప్రేక్షకులను ఆకర్షించే టైటిల్ పెట్టకపోవడం వల్ల కావచ్చు, కాస్టింగ్ మైనస్ అయి ఉండొచ్చు.. కారణాలేవైనప్పటికీ సినిమా లో బజ్‌తో రిలీజైంది. టాక్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. కాగా తన సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు దర్శకురాలు సోషల్ మీడియాలో బాగానే కష్టపడుతోంది.

తన నేపథ్యం గురించి వివరిస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోట్ చేసి ‘మార్టిన్ లూథర్ కింగ్’ సినిమా చూడమని చెప్పడం.. అలాగే మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సెలబ్రెటీలను కూడా ట్యాగ్ చేసి సినిమా చూడమని కోరడం.. ఇలా చేస్తోంది పూజ. ఐతే ‘మార్టిన్ లూథర్ కింగ్’ పూజ సొంత కథతో తెరకెక్కిన సినిమా ఏమీ కాదు. ఇది తమిళంలో విజయవంతమైన ‘మండేలా’కు రీమేక్. పూజ ఈ విషయాన్ని ప్రస్తావించకుండా తనే ఒక గొప్ప సినిమా తీసినట్లుగా పోస్టులు పెట్టడం.. ఒరిజినల్ డైరెక్టర్‌కు క్రెడిట్ ఇవ్వకపోవడం నెటిజన్లకు నచ్చలేదు.

దీన్ని తప్పుబట్టడమే కాక.. తీసిన రీమేక్ సినిమాకు ఇంత హడావుడి ఏంటి అంటూ ఆమెను టార్గెట్ చేశారు. ఇది పూజను బాధించింది. తర్వాతి పోస్టుల్లో ఒరిజినల్ డైరెక్టర్ మడోన్ అశ్విన్‌ను ట్యాగ్ చేయడమే కాక.. రీమేక్ చేస్తే తప్పేంటి, ఒక మంచి కథను తెలుగు ప్రేక్షకులకు అందించాలని చేసిన ప్రయత్నంలో లోపాలు ఎంచుతారా అంటూ మరో పోస్టు పెట్టింది. ఈ గొడవ ‘మార్టిన్ లూథర్ కింగ్’కు సోషల్ మీడియాలో పబ్లిసిటీ తెచ్చిపెడుతున్నప్పటికీ.. వాస్తవంగా అయితే ఈ సినిమాకు సరైన వసూళ్లు లేవు.