రెండో పెళ్లి వార్తలపై నటి ఆగ్రహం

దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగులో క్యారెక్టర్ రోల్స్‌తో ఆకట్టుకుంటోంది సీనియర్ నటి ప్రగతి. ఈ మధ్య కొంచెం జోరు తగ్గినట్లు అనిపిస్తున్నా.. ఆమె ఏదో రకంగా వార్తల్లో మాత్రం నిలుస్తూనే ఉంటుంది. నడి వయస్సులో ఆమె ఫిట్నెస్‌ కోసం పడే కష్టం.. హీరోయిన్ల తరహాలో చేసే ఫొటో షూట్లు తన గురించి సోషల్ మీడియాలో చర్చించుకునేలా చేస్తుంటాయి.

ఐతే ఇటీవల తన వ్యక్తిగత జీవితం గురించి వచ్చిన వార్తలపై ప్రగతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆధారాలు లేకుండా మీడియాలో వార్తలు రాసేశారంటూ ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే తనే స్వయంగా చెబుతానని.. కానీ వెరిఫై చేసుకోకుండా వార్తలు ప్రచురించడం దారుణమని ఆమె ఆవేదన చెందింది.

‘‘నేను పెళ్లి చేసుకుంటున్నట్లు కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు వార్తలు రాశాయి. సోషల్ మీడియాలో కూడా దీని గురించి ప్రచారం జరిగింది. ఈ వార్తలు చూసి చాలా బాధ కలిగింది. ఆధారాలు లేకుండా అలా రాయడం బాధ్యతా రాహిత్యం. నేను నటిని కాబట్టి మీరు ఏమైనా రాయొచ్చని అనుకోవడం తప్పు. మీకేం హక్కు ఉందని వేరొకరి వ్యక్తిగత జీవితం మీద ఇలా ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు రాస్తారు?

నేనీ వార్తలను పూర్తిగా ఖండిస్తున్నా. ఇక ముందైనా ఇలాంటి విషయాలు రాసేటపుడు కొంచెం చెక్ చేసుకుని.. నిజాలు తెలుసుకుని రాయండి. వ్యక్తుల గురించి రాసేటపుడు కొన్ని హద్దులు ఉంటాయి. వాటిని దాటకూడదు. నా వ్యక్తిగత జీవితంలో ఏదైనా జరిగితే, అది చెప్పాలనుకుంటే నేనే వెల్లడిస్తా. అలా కాకుండా నా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా వార్తలు రాయడం సరైన పద్ధతి కాదు’’ అని ప్రగతి పేర్కొంది. తెలుగు సహా పలు భాషల్లో వందకు పైగా సినిమాలు చేసిన ప్రగతి.. ఇటీవలే మెగాస్టార్ మూవీ ‘భోళా శంకర్’లో మెరిసింది.