నాగేశ్వరరావు మేలుకొలుపు ఎందరికో అవసరం

తాము తీసిన అవుట్ ఫుట్ ని అవసరానికి మించి ప్రేమించి విపరీత నిడివితో టాక్ ని దెబ్బ తీసుకుంటున్న దర్శకులకు టైగర్ నాగేశ్వరరావు మేలుకొలుపు ఓ పాఠంగా నిలుస్తోంది. విడుదలైన మూడో రోజుకే 24 నిమిషాల నిడివిని కత్తిరించడం రవితేజ లాంటి స్టార్ హీరో విషయంలో ఇదే మొదటిసారని చెప్పాలి. ఈ నిర్ణయమేదో ముందే తీసుకుని ఉంటే ఇంకా బాగుండేదన్న అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. దీని వల్ల ఇప్పటికిప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ అయిపోదు కానీ టాక్ మరింత డ్యామేజ్ కాకుండా కాస్తయినా బెటర్ గా డీసెంట్ గా వచ్చే అవకాశముంది.

ఇవాళ జరిగిన సక్సెస్ మీట్ లో దర్శకుడు, హీరో, నిర్మాత ఈ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు. ఒకవేళ కట్ చేశామని చెప్పుకుంటే దాని వల్ల లేనిపోని కామెంట్లకు చోటిచ్చినట్టు అవుతుందని సినిమా విజయం గురించే మాట్లాడారు. విడుదలకు ముందు ఇంటర్వ్యూలలో చాలా నమ్మకంగా ఇంకో గంట ఎక్స్ ట్రా ఉన్నా టైగర్ నాగేశ్వరరావు కథను ఎగబడి చూస్తారని చెప్పిన వంశీ టోన్ లో ఈ రోజు చాలా మార్పు కనిపించింది. యాక్షన్ ఎపిసోడ్స్ కి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చిందని, ఫ్యాన్స్ వీడియోలు పంపించి తమ ఆనందాన్ని పంచుకున్నారని చెప్పుకున్నాడు.

రాబోయే రోజుల్లో మూడు గంటల ఫైనల్ కట్ వచ్చే సినిమాల విషయంలో నిర్మాతలు మరింత జాగ్రత్తగా ఉండబోతున్నారనేది మాత్రం అర్థమవుతోంది. అంటే సుందరానికి, ఖుషిల రన్ ఈ కారణంగానే ప్రభావితం చెందటం అభిమానులు మర్చిపోలేరు. నిజంగా ప్రెజెంటేషన్ అద్భుతంగా వచ్చి ఎక్కడ బోరే కొట్టలేదనుకుంటే నిజంగా అంత లెన్త్ ని థియేటర్ ప్రేక్షకులు స్వాగతిస్తారు. అది వదిలేసి ఆత్మవంచన చేసుకునే తరహాలో మేము గొప్పగా తీశాం, ఎడిటింగ్ చేసే సమస్యే లేదని భీష్మించుకు కూర్చుంటే ఫలితాలు రిపీట్ అవుతూనే ఉంటాయి. సో టైగర్ లెసన్ ఒక కనువిప్పుగా మిగిలిపోనుంది.