హిందీ మల్టీప్లెక్సులకు లియో షాక్

తాము విధించిన ఎనిమిది వారాల ఓటిటి గడువు పాటించనందుకు లియో రిలీజును నిషేదించిన ఉత్తరాది మల్టీప్లెక్సులు దానికి తగ్గ మూల్యాన్నే చెల్లించుకుంటున్నాయి. పివిఆర్, ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్ తదితర సంస్థలు తీసుకున్న ఈ నిర్ణయం చివరికి వారికే చేటు చేసింది. లియో టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు నెమ్మదిస్తుందో తెలియదు కానీ ప్రస్తుతానికి జోరు మాత్రం గట్టిగానే ఉంది. పరిమిత హిందీ వెర్షన్ రిలీజులోనూ సింగల్ స్క్రీన్ల మద్దతుతో మొదటి రోజు నాలుగు కోట్లకు పైగా వసూలు చేయడం మాములు విషయం కాదు.

దసరా పండగకు టైగర్ శ్రోఫ్ గణపథ్ పెద్ద ఫీడింగ్ ఇస్తుందని మల్టీప్లెక్సులు ఆశపడ్డాయి. కానీ తీరా చూస్తే అదేమో డిజాస్టర్ కా బాప్ తరహాలో ప్రేక్షకులతో బాబోయ్ అనిపించేసుకుని పెద్ద గునపం దింపేసుకుంది. వసూళ్లు సదరు హీరో కెరీర్ లోనే అత్యంత తక్కువగా నమోదయ్యాయి. టాక్ చూసిన జనాలు టికెట్లు బుక్ చేసుకోవడానికి భయపడుతున్నారు. దీనికన్నా యాభై రోజులకు దగ్గరగా ఉన్న జవాన్ చూడటమే నయమని ఫీలవుతున్నారు. దీన్ని బాట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నవంబర్ 12 టైగర్ 3 వచ్చే దాకా లెక్కలేనన్ని క్యాన్సిల్ షోలు వెక్కరించబోతున్నాయి.

విచిత్రంగా ఇవే మల్టీప్లెక్సులు లియోని దక్షిణాది రాష్ట్రాల్లో స్క్రీనింగ్ చేసుకుంటున్నాయి. తెలుగు తమిళ వెర్షన్లతో శుభ్రంగా సొమ్ములు చేసుకుంటున్నాయి. నిజానికి ఈ ఎనిమిది వారాల కండీషన్ ని బాలీవుడ్ నిర్మాతలు కిమ్మనకుండా భరిస్తున్నారు. దీని వల్ల ఓటిటిలో వచ్చే రెవిన్యూకి భారీ కోత పడుతున్నా మౌనం పాటిస్తున్నారు. లియోని భారీ రేటుకి సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ నాలుగు వారాల థియేట్రికల్ రన్ పూర్తయిన వెంటనే ఓటిటి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. మొత్తానికి లియో వదిలేసినందుకు గణపథ్ ని నమ్ముకున్నందుకు నార్త్ మల్టీప్లెక్సులకు పెద్ద దెబ్బే పడింది.