నాగేశ్వరరావు ఈ ఛాన్స్ వాడుకుంటాడా

దసరా పండగ సినిమాల్లో రెండు వచ్చేసాయి. భగవంత్ కేసరికి కొంచెం డివైడ్ టాక్ ఉన్నప్పటికీ మాస్, ఫ్యామిలీస్ సపోర్ట్ చేసే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విపరీతమైన హైప్ మధ్య వచ్చిన లియోకి నెగటివ్ సౌండ్ ఎక్కువగా వినిపిస్తోంది. మన స్టార్ హీరోల రేంజ్ లో ఓపెనింగ్ ఇచ్చిన తెలుగు ఆడియన్స్ తెరమీద అవుట్ ఫుట్ చూసి నిరాశ చెందినట్టు సోషల్ మీడియా ట్రెండ్స్ చెబుతున్నాయి. విక్రమ్ రేంజ్ లో ఊహించుకుంటే కనీసం మానగరం కూడా లోకేష్ మ్యాచ్ చేయలేకపోయాడని ఫ్యాన్స్ కామెంట్లు విసురుతున్నారు.

ఇదిలా ఉండగా విజయదశమి రేస్ లో చివరి మూవీ టైగర్ నాగేశ్వరరావు పైన వాటి కన్నా ఒకరోజు ఆలస్యంగా థియేటర్లలో అడుగు పెడుతున్నాడు. అంత బడ్జెట్ తో ప్యాన్ ఇండియా స్థాయిలో నిర్మించి ప్రమోట్ చేసినప్పటికీ హైప్ విషయంలో కొంత వెనుకబడిన మాట వాస్తవం. దర్శకుడు వంశీ, నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాత్రం కంటెంట్ మీద చాలా ధీమాగా ఉన్నారు. 3 గంటల 2 నిమిషాల సుదీర్ఘ నిడివికి ఖచ్చితంగా న్యాయం జరిగిందని ఫీలవుతారని ఘంటాపథంగా చెబుతున్నారు. రవితేజ తన వంతు బాధ్యతగా నార్త్ కు వెళ్లి మరీ ప్రమోషన్లలో  భాగం పంచుకున్నాడు.

పండగ సెలవులు ఇంకా వారం రోజులు ఉన్నాయి కాబట్టి భగవంత్ కేసరిలాగా టైగర్ నాగేశ్వరరావు కూడా డీసెంట్ టాక్ తెచ్చుకుంటే బాక్సాఫీస్ వద్ద సంయుక్త విజేతలుగా నిలవొచ్చు. షోలు ఉదయం 7 నుంచే ప్రారంభం కాబోతున్నాయి. ఓవర్సీస్ రిపోర్ట్స్ తెల్లవారక ముందే వచ్చేస్తాయి. ఇంత పెద్ద పీరియాడిక్ డ్రామా చేయడం రవితేజకి ఇదే మొదటిసారి. అందుకే ఫ్యాన్స్ గ్రాండ్ ఓపెనింగ్ ని ఆశిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చిన టైగర్ లో దశాబ్దాల క్రితం స్టువర్ట్ పురం అనే దొంగల ఊరిలో జరిగిన సంఘటనలను ఇందులో చూపించబోతున్నారు. మరి మాస్ రాజా ఏం చేయబోతున్నాడో.