తెలుగు సినిమా గర్వపడే క్షణాలు

టాలీవుడ్ పరిశ్రమకు దశాబ్దాల కలగా మిగిలిపోయిన జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అల్లు అర్జున్ ఇవాళ సగర్వంగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్నాడు. తండ్రి అల్లు అరవింద్, భార్య స్నేహతో పాటు ఇతర అవార్డులు స్వీకరించడానికి వచ్చిన సాటి తెలుగు ప్రముఖుల కళ్ళు ఆనందంగా మెరుస్తూ ఉండగా స్టేజిపైకి వెళ్లి సవినయంగా బెస్ట్ యాక్టర్ గౌరవాన్ని తీసుకున్నాడు. గతంలో ఎందరో గొప్ప నటులు, హీరోలు పుష్పకన్నా గొప్ప చిత్రాల్లో నటించినా రకరకాల కారణాల వల్ల ఇది చిరకాల స్వప్నంగా మిగిలిపోయింది.

చివరికి 2021 సంవత్సరానికి పుష్ప ద్వారా సాకారం కావడం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. బన్నీతో పాటు ఇతర విభాగాలకు గాను నేషనల్ అవార్డు తీసుకున్న వాళ్లలో ప్రేమ్ రక్షిత్, దేవిశ్రీ ప్రసాద్, కీరవాణి, కాలభైరవ, బుచ్చిబాబు సన తదితరులున్నారు. ఎన్టీఆర్ నుంచి చిరంజీవి హయాం దాకా ఎవరికీ సాధ్యం కాని ఘనత దక్కించుకున్న అల్లు అర్జున్ పై ఇప్పుడు బాధ్యత మరింత రెట్టింపయ్యింది. పుష్ప 2 ది రూల్ మీద ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. దానికి అనుగుణంగానే దర్శకుడు సుకుమార్ మరింత జాగ్రత్తగా పుష్పరాజ్ కథను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఈవెంట్ కి ముందు అల్లు అర్జున్ మాట్లాడుతూ ఒక కమర్షియల్ సినిమాకు ఇంత పెద్ద గౌరవం అందుకోవడం గర్వకారణంగా ఉందని చెప్పాడు. ఇది నిజమే. ఎందుకంటే పుష్ప కళాత్మక విలువలున్న లేదా సమాజానికి సందేశమిచ్చే చిత్రం కాదు. సబ్జెక్టు పక్కనపెడితే అనితర సాధ్యం అనిపించే రీతిలో పుష్ప పాత్రలో బన్నీ పరకాయ ప్రవేశం చేసిన తీరు దేశవ్యాప్తంగా ఆడియన్స్ నే కాదు నేషనల్ అవార్డు కమిటీ సభ్యులను సైతం మెప్పించింది. చివరికి కల నిజమైంది. రాబోయే రోజుల్లో ప్రతి ఏడాది తెలుగు నుంచి అన్ని విభాగాల్లోనూ బలమైన పోటీ ఇవ్వబోయే సినిమాలు రాబోయేది స్పష్టం.