ఇంద్రసేనారెడ్డి అభిమానిగా పుష్పరాజ్  

ప్యాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు మోస్తున్న పుష్ప 2 ది రూల్ షూటింగ్ క్రమం తప్పకుండా జరుగుతోంది. ఇవాళ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా రాష్ట్రపతి చేతుల మీద అవార్డు అందుకోబోతున్న సందర్భంగా రెండు మూడు రోజులు బ్రేక్ ఇచ్చారు తప్పించి ఆ తర్వాత యథావిధిగా మళ్ళీ కొనసాగబోతోంది. ఫస్ట్ పార్ట్ కన్నా చాలా టెర్రిఫిక్ ఎపిసోడ్స్ ని దర్శకుడు సుకుమార్ దీని కోసం ప్లాన్ చేశారు. ట్విస్టులు కూడా బోలెడుంటాయి. బన్నీ, ఫహద్ ఫాసిల్ మధ జరిగే యుద్ధం ఊహకందని స్థాయిలో డిజైన్ చేశారని యూనిట్ నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి అర్థమవుతోంది.

తాజాగా వచ్చిన లీక్ ప్రకారం ఇందులో  బన్నీని చిరంజీవి వీరాభిమానిగా చూపిస్తున్నారట. ఇంద్ర సినిమా రిలీజైన టైంలో పుష్ప రాజ్ భార్య శ్రీవల్లిని థియేటర్ కు తీసుకొచ్చి సినిమా చూపించే సన్నివేశం ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇవ్వడం ఖాయమంటున్నారు. ఇక్కడే హత్య ప్రయత్నం జరిగే సీన్ కూడా ఓ రేంజ్ లో ఉంటుందని వినికిడి. అంటే తెరమీద ఇంద్రసేనారెడ్డి ఫ్యాక్షనిజంకి పుష్ప చేయబోయే అల్లరి ప్లస్ వయొలెన్స్ భారీగా చూడొచ్చన్న మాట. పుష్ప 1లోనూ రష్మిక మందన్నకు బన్నీ చూడాలని ఉంది సినిమా టికెట్లు ఇప్పించే ట్రాక్ బాగానే పేలడం గుర్తేగా.

ఇలాంటివి అధికారికంగా చెప్పరు కానీ లీకైన ఫోటోలు గట్రా చూస్తుంటే నిజమే అనిపిస్తున్నాయి. 2024 ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న పుష్ప 2 కి ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ కోసం తగినంత సమయం దొరికేలా సుకుమార్ ప్లాన్ చేసుకుంటున్నారు. మొదటి భాగం రీ రికార్డింగ్ విషయంలో జరిగిన పొరపాట్లు, వచ్చిన ఫీడ్ బ్యాక్ దృష్టిలో ఉంచుకుని ఈసారి దేవిశ్రీ ప్రసాద్ కి తగినంత టైం దొరికేలా చూస్తున్నారు. అన్ని ప్లాన్ ప్రకారమే జరిగిపోయి జూన్ కంతా సెన్సార్  కాపీ సిద్ధం చేయొచ్చు.  జూలై మొత్తం నెల రోజులు పూర్తిగా ఇండియా వైడ్ ప్రమోషన్స్ కోసం టూర్ డిజైన్ చేస్తారు.