వెంకీ ఫ్యాన్స్ నిరీక్షణ ఫలించింది

ఒకప్పుడు టాలీవుడ్ టాప్-4 హీరోల్లో ఒకడు విక్టరీ వెంకటేష్. 90వ దశకం వరకు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునల పాటుగా వైభవం చూసిన హీరో ఆయన. ఆయన పేరిట కొన్ని ఇండస్ట్రీ హిట్లు కూడా ఉణ్నాయి. ఐతే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తరం వచ్చాక క్రమంగా మిగతా సీనియర్ హీరోల్లాగే ఆయన జోరూ తగ్గింది. ఇక ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి నెక్ట్స్ జనరేషన్ స్టార్లు వచ్చాక వెంకీ మిడ్ రేంజ్ హీరోలా మారిపోయాడు.

మారుతున్న కాలానికి తగ్గట్లు ఆయన కూడా ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి ఎన్నో ప్రయోగాలు చేశాడు. మాస్- యాక్షన్ పక్కన పెట్టి క్లాస్, ఫ్యామిలీ, కామెడీ సినిమాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఈ తరహా సినిమాలతో వెంకీ చాలా విజయాలు అందుకున్నప్పటికీ.. ఫ్యాన్స్‌లో ఒక అసంతృప్తి మాత్రం ఉండిపోయింది. ఎలివేషన్లతో నిండిన పూర్తి స్థాయి యాక్షన్ సినిమాలో తమ హీరోను చూడాలని సగటు వెంకీ అభిమానులు కోరుకుంటున్నారు.

ఘర్షణ, తులసి లాంటి సినిమాల తర్వాత వెంకీ అలాంటి ప్రయత్నమే చేయలేదు. ఇక మళ్లీ వెంకీ నుంచి ఇలాంటి మాస్, ఫ్యాన్ మూమెంట్స్ ఉన్న సినిమా ఎప్పుడు చేస్తాడా అని సుదీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్న సమయంలో ఆయన ‘సైంధవ్’తో వారి నిరీక్షణకు తెరదించబోతున్నాడు. ఈ సినిమా ప్రి టీజర్ చూసినపుడే ఇది పక్కా యాక్షన్ మూవీ అనే సంకేతాలు కనిపించాయి. ఈ రోజు రిలీజ్ చేసిన టీజర్ ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గలేదు.

కథలోని భారీతనం.. నవాజుద్దీన్ సిద్ధిఖి విలనిజం.. టీజర్లో కనిపించిన యాక్షన్ ఘట్టాలు, బ్లాస్ట్‌లు.. వెంకీ పేల్చిన మాస్ డైలాగ్.. ఆయన అప్పీయరెన్స్.. అన్నీ కూడా అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చాయి. సినిమా మీద అంచనాలను భారీగా పెంచాయి. వెంకీని మళ్లీ ఇలా మాస్ అవతార్‌లో చూడటం అభిమానులకు అమితానందాన్నిస్తోంది. మాస్ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగే ఉంటాయి. కాబట్టి చాలా ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ దగ్గర వెంకీ అభిమానుల మాస్ జాతర చూడబోతున్నట్లే.