జగదేకవీరుడు సీరియస్ వార్నింగ్ ఎందుకిచ్చాడు  

టాలీవుడ్ సినిమాల్లో జగదేకవీరుడు అతిలోకసుందరిది చాలా ప్రత్యేక స్థానం. 1990లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ని వరదలు ముంచెత్తినప్పుడు తప్పని పరిస్థితుల్లో విడుదల చేయాల్సి వస్తే నిర్మాత అశ్వినిదత్ కేవలం కంటెంట్ మీద నమ్మకంతో ముందడుగు వేశారు. దానికి తగ్గట్టే ఈ మూవీ సృష్టించిన చరిత్ర అంతా ఇంతా కాదు. మేజిక్ చేస్తే ఎలాంటి సిల్లీ లాజిక్స్ అయినా ప్రేక్షకులు క్షమించి ఆదరిస్తారని చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదు . అందుకే వైజయంతి మూవీస్ ఇప్పటికీ తన బ్యానర్ బిజిఎంగా మహానటి నుంచి ఇళయరాజా కంపోజ్ చేసిన ట్యూనే వాడుకుంటోంది.

అంత గొప్పగా సంపదగా ఫీలయ్యే జగదేకవీరుడు అతిలోకసుందరి గురించి ట్విట్టర్ వేదికగా ఒక పెద్ద వార్నింగ్ వచ్చింది. ఈ క్లాసిక్ హక్కులు ఎవరికీ ఇవ్వలేదని, ఏ రూపంలో అయినా ఎవరైనా రీమేక్ కానీ లేదా పాత్రలను పునఃసృష్టించి మళ్ళీ వాడుకునే ప్రయత్నం చేసినా చట్టపరమైన చర్యలు ఎదురుకోవాల్సి ఉంటుందని అధికారికంగా ఒక నోట్ రిలీజ్ చేసింది. చాంతాడంత మ్యాటర్ ఉన్నా ప్రధాన సారాంశం మాత్రం ఇక్కడ చెప్పిందే. ప్రతి క్యారెక్టర్, విభాగానికి సంబంధించిన ఇంటలెక్చువల్ రైట్స్ ఎవరికీ ఇవ్వలేదని స్పష్టంగా చెప్పారు. రీ రిలీజ్ కూడా ఎవరూ చేయడానికి వీల్లేదన్న మాట.

ఇంత హఠాత్తుగా హెచ్చరిక చేయడానికి కారణం ఏమిటా అని ఫ్యాన్స్ తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. కొన్ని అంశాలు కనిపిస్తున్నాయి. మెగా 157ని జగదేకవీరుడు ఛాయల్లోనే దర్శకుడు వసిష్ఠ వశిష్ట రాసుకున్నాడని టాక్ ఉంది. అది నిజమో కాదో కూడా తెలియదు. మరోవైపు ప్రశాంత్ వర్మ హనుమాన్ లోనూ కొన్ని రెఫరెన్సులు ఉన్నాయని వినికిడి. దేనికీ నిర్ధారణ లేదు కాబట్టి ఇవన్నీ ఊహాగానాల కిందే తీసుకోవాలి. అయితే సడన్ గా వైజయంతి ఇంత పెద్ద మెసేజ్ పెట్టేటప్పటికీ అభిమానులు ఖంగారు పడ్డారు. ఇలా కాదు కానీ ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ ని 4Kలో రీ రిలీజ్ చేయాలని మూవీ లవర్స్ డిమాండ్. దాన్నైనా తీరుస్తారో లేదో.