దిల్ రాజుకు ‘సలార్’ షాక్

టాలీవుడ్‌లో భారీ చిత్రాల డిస్ట్రిబ్యూషన్ అంటే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ముందు వరుసలో నిలబడతాడు. క్రేజీ కాంబినేషన్లలో తెరకెక్కే భారీ చిత్రాలను చాలా వరకు ఆయనే డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు. సినిమాల ఫలితాలను, వాటి మార్కెట్ రీచ్‌ను సరిగ్గా అంచనా వేసి, రికార్డు రేట్లు పెట్టి కొనడం రాజుకు అలవాటు. ఆ రేటును గిట్టుబాటు చేసేలా రిలీజ్ ప్లానింగ్ కూడా పక్కాగా ఉండేలా చూసుకుంటాడు.

ఆయన చేతికి సినిమాను అప్పగిస్తే నిర్మాతలు కళ్లు మూసుకుని మిగతా పనులు చూసుకోవచ్చు అన్నట్లుంటుంది. రిలీజ్ పరంగా కానీ, పేమెంట్ విషయంలో కానీ ఏ రకమైన ఇబ్బంది రాకుండా చూసుకుంటాడనే పేరు రాజుకు ఉంది. అందుకే ఎక్కువగా పెద్ద సినిమాల డీల్స్ రాజు చేతికే వెళ్తుంటాయి. టాలీవుడ్ నెక్ట్స్ బిగ్ రిలీజ్ ‘సలార్’ను దిల్ రాజే రిలీజ్ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఆయనే నైజాం ఏరియాకు హైయెస్ట్ రేట్ కోట్ చేశాడని.. డీల్ ఓకే కావడం లాంఛనమే అని వార్తలు వచ్చాయి.

కానీ రాజుతో పాటు అందరికీ పెద్ద షాకిస్తూ మైత్రీ మూవీ మేకర్స్ ‘సలార్’ నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకుందన్నది తాజా సమాచారం. రాజుకు హక్కులు వెళ్లడం లాంఛనమే అనుకున్న స్థితిలో మైత్రీ అనూహ్యంగా రేసులోకి వచ్చి రైట్స్‌ను తన్నుకుపోయింది. నైజాంలో తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్న రాజుకు చెక్ పెడుతూ ఏడాది కిందటే కొత్తగా డిస్ట్రిబ్యూషన్ సంస్థను ఏర్పాటు చేసింది మైత్రీ సంస్థ.

తమ బేనర్లో తెరకెక్కిన సంక్రాంతి సినిమాలు ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’లను ఆ సంస్థ నుంచే రిలీజ్ చేశారు. ఆ తర్వాత మైత్రీ డిస్ట్రిబ్యూషన్లో అంతగా యాక్టివ్‌గా ఏమీ లేదు. కానీ ఇప్పుడు ‘సలార్’ లాంటి క్రేజీ మూవీని దక్కించుకుని మైత్రీ సంచలనం రేపింది. దిల్ రాజు రూ.65 కోట్ల రేటు కోట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయినా మైత్రీ వాళ్లకు హక్కులు వెళ్లాయంటే ఐదు పది కోట్లు ఎక్కువే ఇచ్చి తీసుకున్నారన్నమాట. మరి ఇంత రేటును వర్కవుట్ చేసి లాభాలు తెచ్చుకోవడం అంటే మాటలు కాదు.