ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో ఆలస్యం లేదు

నిన్న దేవర రెండు భాగాలు ప్రకటించాక కొన్ని అనుమానాలు తలెత్తాయి. డిసెంబర్ తర్వాత వార్ 2 షూటింగ్ స్టార్టవుతుంది. దేవర 2 ని ఎప్పుడు మొదలుపెడతారో కొరటాల శివ చెప్పలేదు కానీ మరీ ఆలస్యం చేయడానికి ఉండదు. అలాంటప్పుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేసిన భారీ ప్యాన్ ఇండియా మూవీని ఆలస్యం చేస్తారేమోనని ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే సలార్ 2 షూటింగ్ ఇంకా చాలా ఉంది. సీజ్ ఫైర్ రిలీజయ్యాక సీక్వెల్ తో బిజీ అయిపోతే ఎంతలేదన్నా ఏడాది రెండేళ్లు పడుతుంది. అలాంటప్పుడు సహజంగానే తారక్ ప్రాజెక్టు మరింత లేట్ అవుతుంది.

ఇవన్నీ గమనించే మైత్రి అధినేతలు అధికారికంగా క్లారిటీ ఇచ్చేశారు. 2024 ఏప్రిల్ నుంచి తారక్ ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని, కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసే దిశగా ఊహించనంత గొప్పగా ఉంటుందని చెప్పేశారు. ఇంతకు మించి వివరం ఇవ్వలేదు కానీ అభిమానులకు ఇదే పెద్ద రిలీఫ్. సమ్మర్ లోనే మొదలవుతుంది కనక నీల్ ఒకేసారి సలార్ 2, జూనియర్ ప్రాజెక్ట్ సమాంతరంగా టేకప్ చేస్తాడని అర్థమైపోయింది. లేదూ అంటే ప్రభాస్ వైపు నుంచి ఎలాగూ సలార్ 1 తర్వాత కల్కి, మారుతీ సినిమా రిలీజులు ఉంటాయి కాబట్టి సలార్ 2 ఒక ఏడాది ఆగి చూసుకోవచ్చు.

మొత్తానికి ఒక పెద్ద సందేహం తీర్చేశారు. దేవర తర్వాత వార్ పూర్తి చేసే జూనియర్ ఎన్టీఆర్ వెంటనే ప్రశాంత్ నీల్ ప్రపంచంలో అడుగు పెడతాడు. అది ఒక కొలిక్కి వస్తున్న టైంలో దేవర 2 ఉంటుంది. ఆపై సితార బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్టు కార్యరూపం దాల్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చిన ఇమేజ్ కు అనుగుణంగా చాలా జాగ్రత్తగా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న యంగ్ టైగర్ ఏడాదికి ఖచ్చితంగా ఒక రిలీజ్ ఉండేలా చూసుకుంటున్నాడు. వచ్చే ఏడాది దేవర ఏప్రిల్ 5, ఆపై సంవత్సరం వార్ టూ జనవరి 25 ఆల్రెడీ ఫిక్స్ అయ్యాయి. తర్వాతి వరసలో దేవర 2, ప్రశాంత్ నీల్ సినిమాలుంటాయి.