షాక్‌లో తార‌క్ ఫ్యాన్స్

ఈ రోజుల్లో చిత్ర బృందాలు చాలా సీక్రెట్‌గా ఉంచాల‌నుకున్న విష‌యాలు కూడా ఏదో ఒక ద‌శ‌లో బ‌య‌టికి వ‌చ్చేస్తుంటాయి. చిత్ర బృందంలోని వాళ్లే ఎవ‌రో ఒక‌రు మీడియాకు విష‌యం లీక్ చేయ‌డం.. లేదా త‌మ స‌న్నిహితుల‌తో విష‌యం చెబితే వాళ్లు ఇంకెవ‌రితోనో పంచుకోవ‌డం.. అలా సోష‌ల్ మీడియా, మీడియాలో విష‌యం బ‌ట్ట‌బ‌య‌లు అయిపోవ‌డం జ‌రుగుతుంటుంది. అందులోనూ ఒక సినిమాను రెండు భాగాలుగా తీయాల‌ని అనుకుంటే దాన్ని దాచ‌డం చాలా చాలా క‌ష్ట‌మైపోతుంది.

ఈ పార్ట్-2 ట్రెండ్ మొద‌ల‌య్యాక అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌డానికి చాలా ముందే విష‌యం బ‌య‌టికి వ‌చ్చేస్తోంది. ఇలాంటి రోజుల్లో దేవ‌ర టీం అంద‌రికీ పెద్ద షాక్ ఇచ్చింది. బుధ‌వారం ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ స్వ‌యంగా ప్ర‌క‌ట‌న చేసే వ‌ర‌కు ఎక్క‌డా ఈ విష‌యం అస్స‌లు లీక్ కాలేదు. ఇది ఎన్టీఆర్ అభిమానుల‌కే కాదు.. మీడియా వాళ్ల‌కు కూడా పెద్ద షాక్.

మీడియాకు విష‌యం చేర‌కుండా దేవ‌ర టీం ఎంత ప‌కడ్బందీగా వ్య‌వ‌హ‌రించిందో అని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఈ విష‌యంలో ఆ టీంను అభినందిస్తున్నారు. ఇక దేవ‌ర టీంను ఎప్పుడూ అప్‌డేట్ అప్‌డేట్ అంటూ వెంట‌ప‌డే అభిమానులు.. తాము అస్స‌లు ఊహించ‌ని విధంగా పార్ట్-2 అప్‌డేట్ ఇవ్వ‌డంతో ఒక ర‌క‌మైన షాక్‌లో ఉన్నారు. దీనిపై ఎలా స్పందించాలో తెలియ‌ని అయోమ‌యం వారిలో కనిపిస్తోంది.

ముందు విష‌యాన్ని జీర్ణించుకుని ఆ త‌ర్వాత త‌మ ఎగ్జైట్మెంట్‌ను పంచుకుందాం అనుకుంటున్నారు. దేవ‌ర మీద మామూలుగానే అంచ‌నాలు ఒక రేంజిలో ఉండ‌గా.. పార్ట్-2 అనౌన్స్ చేయ‌డం, దాని గురించి చెబుతూ కొర‌టాల ఔట్‌పుట్ గురించి గొప్ప‌గా మాట్లాడ‌టంతో ఇంకా అంచ‌నాలు పెరిగిపోయాయి అభిమానుల్లో. పార్ట్-1 అనుకున్న‌ట్లే వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5న రాబోతుండ‌గా.. ఇంకో ఏడాది లోపే పార్ట్-2ను కూడా తేవాల‌నుకుంటోంది దేవ‌ర టీం.