రన్బీర్ కపూర్ సమన్ల వెనుక అసలు కథ

బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ కు ఈడి(ఎంఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) సమన్లు జారీ చేయడం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఎల్లుండి విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. రామాయణంలో రాముడిగా చేయబోతున్నట్టు నిన్న సాయంత్రం మీడియాలో హడివిడి జరిగిన కొద్దిగంటలకే ఇలా జరగడం విశేషం. అసలు తెరవెనుక మ్యాటరేంటో చూద్దాం. ఛత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన సౌరభ్ చంద్రఖర్, రవి అనే ఇద్దరు వ్యక్తులు దుబాయ్ నుంచి మహాదేవ్ బెట్టింగ్ యాప్ ని నిర్వహిస్తున్నారు. ఇందులో వేలాది కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతూ ఉండేవి. ఇది పైకి కనిపించే పొర.

అసలు ట్విస్టు ఏంటంటే ఈ దందాను అడ్డుపెట్టుకుని ఈ ఇద్దరు మనీ లాండరింగ్ కు పాల్పడ్డారు. హవాలా ద్వారా డబ్బుని ఆఫ్ షోర్ అకౌంట్లకు బదిలీ చేయడం ద్వారా మోసాలకు తెరతీశారు. యాప్ కి కస్టమర్లను ఆకట్టుకునేందుకు భారీ ఎత్తున ప్రకటనలు ఇవ్వడం ఈ సంస్థ నిత్యకృత్యం. మహాదేవ్ కార్యకలాపాలు నడుస్తున్న కోల్కతా, భోపాల్, ముంబై లాంటి ప్రధాన నగరాల్లో ఈడీ సోదాలు నిర్వహించి ఇటీవలే 417 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. మరో మలుపు కూడా ఉంది. ఫిబ్రవరిలో సౌరభ్ చంద్రశేఖర్ వివాహం దుబాయ్ లో జరిగింది. రెండు వందల కోట్లకు పైగా ఖర్చు పెట్టారట.

ఈ  పెళ్లికి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. వాళ్ళ కోసం ప్రైవేట్ జెట్ కూడా ఏర్పాటు చేశారు మహాదేవ్ పార్ట్ నర్స్. గెస్టులుగా వెళ్లిన వాళ్లలో రన్బీర్ తో పాటు సన్నీ లియోన్, టైగర్ శ్రోఫ్, నేహా కక్కర్, రహత్ ఫతేహ్, అలీ అస్గర్ ఇలా పెద్ద లిస్ట్ ఉందట. ఇదంతా పలు ఇంగ్లీష్ మీడియా మాధ్యమాల్లో ప్రసారమైన కథనాల ఆధారంగా ఈడి లోతుగా విచారణ చేసి సదరు నటీనటులను ఒక్కొక్కరుగా పిలిచే పనిలో పడ్డారు. మొత్తం 17 మంది దాకా విచారించే అవకాశమున్నట్టు తెలిసింది. మొత్తానికి ఎవరో జ్వాలలు రగిలించారు వేరెవరో బలయ్యారు తరహాలో ఇదంతా సినిమా స్టోరీని మించి ఉంది.