దేవర 2 ఆగమనం – కొరటాల శుభవార్త   

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు విపరీతంగా ఎదురు చూస్తున్న దేవరకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ దర్శకుడు కొరటాల శివ నుంచి స్వయంగా వీడియో రూపంలో వచ్చేసింది. అందరూ ఊహించినట్టు దేవర ఒక్క భాగం కాదు. సీక్వెల్ కూడా ఉండబోతోంది. దానికి కారణాలు వివరించిన కొరటాల ఇంత గొప్ప కథని రెండున్నర గంటల్లో చెప్పలేమని, ప్రతి పాత్ర, సన్నివేశం డిటైలింగ్ డిమాండ్ చేయడంతో అనిర్వచనీయమైన అనుభూతిని ఇవ్వడం కోసం కొనసాగింపు ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్టు అఫీషియల్ గా చెప్పారు. సో దేవరని రెండుసార్లు చూడబోతున్నామన్న మాట.

వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5 మొదటి భాగం విడుదలవుతుందని చెప్పిన కొరటాల శివ దేవర 2కి సంబంధించి ఎక్కువ సమాచారం ఇవ్వలేదు. నిజానికి ఇంత గ్రాండ్ స్కేల్ లో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీకి కంటిన్యుయేషన్ అవసరమే. బాహుబలి, కెజిఎఫ్ లాంటివి ఈ కారణంగానే గొప్ప విజయాన్ని అందుకుని వేలకోట్ల వసూళ్లు చవిచూశాయి. సముద్రపు బ్యాక్ డ్రాప్ లో ఒక సరికొత్త ప్రపంచాన్ని చూపించబోతున్న దేవరను సైతం ఆ రేంజ్ లో చూడాలని జూనియర్ ఫ్యాన్స్ కోరుకోవడం అత్యాశ కాదు. ఏదైతేనేం ఫైనల్ గా సానుకూల నిర్ణయం తీసుకున్నారు.

ఇక్కడో విషయం అర్థం చేసుకోవచ్చు. దేవరలో తారక్ డ్యూయల్ రోలని గతంలోనే లీక్ వచ్చింది. అంటే తండ్రి కొడుకుల షేడ్స్ ని విడివిడిగా చూసే ఛాన్స్ రావొచ్చు. అయితే ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తారా లేదానేది ఇంకా తేలాల్సి ఉంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం రెండు పాత్రలు యువకులుగానే కనిపిస్తాయని బాహుబలిలో ప్రభాస్ టైపు ట్రీట్ మెంట్ ఉంటుందని అంటున్నారు. ఇవేవి అంత సులభంగా నమ్మడానికి లేదు కానీ కనీసం ఒక టీజర్ వచ్చాక కొంత అవగాహనకు రావొచ్చు. దేవర 2 ఎలా చూసుకున్నా 2025 వేసవి తర్వాతే విడుదల ఉంటుంది. షూటింగ్ సమాంతరంగా జరుగుతుందేమో చూడాలి.