తేనె తుట్టెను కదిపిన రైటర్

టాలీవుడ్ సీనియర్ రైటర్లలో ఒకడైన బీవీఎస్ రవి.. దర్శకుడిగా కూడా ‘వాంటెడ్’, ‘జవాన్’ చిత్రాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. గత ఏడాది నాగచైతన్య నుంచి వచ్చిన డిజాస్టర్ మూవీ ‘థాంక్యూ’కు కథ అందించింది రవినే. బాలకృష్ణ సూపర్ హిట్ రియాలిటీ షో ‘అన్‌స్టాపబుల్’కు కర్త కర్మ క్రియ అతనే. సినిమాలు, టీవీ షోల సంగతి పక్కన పెడితే రవి సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్‌గానే ఉంటాడు. తన మిత్రుడే అయిన హరీష్ శంకర్‌తో కూడా ఆ మధ్య ట్విట్టర్లో సంవాదంతో వార్తల్లో నిలిచాడు రవి.

ఇప్పుడు ఆయన ట్విట్టర్లో పెట్టిన ఒక కామెంట్.. తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వాళ్లలో కొందరు రవి మీద ఘాటైన విమర్శలు చేస్తే.. ఇంకొందరు బూతుల వర్షం కురిపించేశారు. తెలుగుదేశం నేత బండారు సత్యనారాయణ అరెస్ట్ నేపథ్యంలో రవి పెట్టిన కామెంటే ఇందుకు కారణం. వైసీపీ మంత్రి రోజా మీద కొన్ని రోజుల కిందట బండారు సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. దీనిపై వైసీపీ మౌత్ పీస్‌ లాగా మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు ఫిర్యాదు చేయడం.. ఆ తర్వాత బండారు మీద కేసు నమోదు కావడం.. తాజాగా ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగాయి.

బండారు అరెస్ట్ నేపథ్యంలో రవి ట్విట్టర్లో స్పందించాడు. “ఈ అరెస్ట్ నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఏమంటే.. మైక్ దొరికింది కదా అని నోటికొచ్చింది పిచ్చి పిచ్చిగా వాగేయకూడదు’’ అని కామెంట్ చేశాడు. ఐతే ఈ కామెంట్ టీడీపీ వాళ్లకు మండిపోయేలా చేసింది. రోజా, కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్లు ఇంత కంటే దారుణమైన మాటలు అన్నపుడు రవి ఎక్కడికిపోయాడని వాళ్లు ప్రశ్నించారు.

అప్పుడు కూడా ఆ వ్యాఖ్యలను ఖండించి ఉంటే హీరో అయ్యేవారని.. కేవలం టీడీపీ నాయకుడి అరెస్ట్ మీద మాత్రమే స్పందించడం, నీతులు చెప్పడం ఏంటని వాళ్లు ఆయనపై మండిపడ్డారు. తనపై తీవ్ర స్థాయిలో దాడి జరగడంతో బీవీఎస్ రవి.. ఇంకో ట్వీట్ వేశాడు. ‘‘తప్పుడు మాటలన్న వారిని అరెస్ట్ చేయడం అభినందనీయం. అయినా ఆ చార్య పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ వర్తిస్తేనే గౌరవం. లేదంటే ప్రతీకార చర్యగా ప్రజలు భావిస్తారు. అప్పుడు ప్రజా చర్య సమాధానమవ్వచ్చు’’ అంటూ టీడీపీ వాళ్లను శాంతింపజేసే ప్రయత్నం చేశాడు రవి.