ప్రీమియర్ల అయోమయంలో నిర్మాతలు

గత ఏడాది కాలంగా మీడియం సినిమాల ప్రొడ్యూసర్లకు బాగా ఉపయోగడుతున్న ప్రమోషన్ అస్త్రం ప్రీమియర్లు. అసలు విడుదల తేదీకి ఒకటి రెండు రోజుల ముందు షోలు వేయడం వల్ల దాని తాలూకు టాక్ సోషల్ మీడియాలో వేగంగా వెళ్ళిపోయి తద్వారా ఓపెనింగ్స్ కి ఉపయోగపడుతున్నాయి. మేజర్, 777 ఛార్లీ, సామజవరగమన, మేం ఫేమస్, బేబీ లాంటివన్నీ ఈ స్ట్రాటజీ వల్ల లాభం పొందినవే. ఇదే ప్లాన్ రివర్స్ కొట్టినవి లేకపోలేదు. హిడింబ, రంగబలి, పెదకాపు 1 వగైరాలు అనవసరంగా ఈ మోడల్ జోలికి వెళ్లి దెబ్బ తిన్నాయి. మార్నింగ్ షో నుంచే నష్టపోయాయి. ఇక విషయానికి వద్దాం.

ఈ వారం 6న విడుదల కాబోయే చిత్రాల నిర్మాతలు ప్రీమియర్లు వేయాలా వద్దానే అయోమయంలో ఉన్నారు. స్కంద, చంద్రముఖి 2, పెదకాపు 1 మూడు రేపటి నుంచి డెడ్ స్లీప్ కి వెళ్లిపోతాయి. కాబట్టి కొత్త వాటికి బోలెడు స్కోప్ ఉంటుంది. మ్యాడ్ నిర్మాణ వ్యవహారాలు చూస్తున్న నాగవంశీ నాలుగో తేదీ నుంచే ప్రధాన కేంద్రాల్లో షోలు వేయడం గురించి తన టీమ్ తో చర్చిస్తున్నారు. కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ బృందం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సుధీర్ బాబు మామా మశ్చీంద్రకు హైదరాబాద్ లో మాత్రమే అయిదో తేదీ సాయంత్రం షోలు వేయాలని చూస్తున్నారు.

ఇంకా ఏవీ ఫైనల్ కాలేదు. మీడియాకు మాత్రమే వేయాలా లేక సాధారణ ప్రేక్షకులకు కూడా ఓపెన్ చేయాలానే మీమాంస తీరడం లేదట. ఆరేడు సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ మీద దాడి చేయబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఓపెనింగ్స్ గురించి టెన్షన్ ఉంది. టాక్ చాలా కీలక పాత్ర పోషించనుంది. ఏ మాత్రం పాజిటివ్ వచ్చినా చాలు దసరాకు బాలకృష్ణ, రవితేజ, విజయ్ వచ్చేలోగా బాగా వర్కౌట్ చేసుకుని బయట పడొచ్చు. కాకపోతే స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం వల్ల ప్రతిదీ సవాలుగానే కనిపిస్తుంది. ఏదైనా సరే రేపు లేదా ఉదయం లోపే తేల్చేయాలి. లేదంటే డైరెక్ట్ గా రిలీజ్ రోజు కలుసుకోవడమే.