పెన్ మద్దతుతో షారుఖ్ మాస్టర్ ప్లాన్

తనకు పోటీ వస్తూ పెద్ద సమస్యే తీసుకురాబోతున్న సలార్ ని ఎదురుకోవడానికి షారుఖ్ ఖాన్ స్వయంగా రంగంలోకి దిగినట్టు ముంబై టాక్. పైకి చెప్పకపోయినా లోలోపల వ్యవహారాలు గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నాయట. దీని కోసం పెన్ సంస్థ అధినేత మరుధర్ మద్దతు కోరినట్టు తెలిసింది. డుంకీ డిస్ట్రిబ్యూషన్ ఆయనకు అప్పగించడం ద్వారా నార్త్ లో వీలైనన్ని ఎక్కువ స్క్రీన్లు తనకే వచ్చేలా స్కెచ్ వేస్తున్నారట. దీని కోసం పెన్ ఓనర్ తో షారుఖ్, సహ నిర్మాత గౌరవ్ వర్మ పలు దఫాలు ముంబైలో గుట్టు చప్పుడు కాకుండా మీటింగులు జరిపినట్టు  తాజా అప్డేట్.

ఈ మొత్తం స్ట్రాటజీలో మరో ఇద్దరు భాగస్వాములు ఉన్నారు. ఓటిటి హక్కులు సొంతం చేసుకున్న జియో సినిమా పలు సలహాలు ఇచ్చి రిలయన్స్ మార్కెటింగ్ తరఫున పలుకుబడి ఉపయోగించి థియేటర్లు ఎక్కువ వచ్చేలా ఏం చేయాలో సూచనలు చేస్తున్నట్టు వినికిడి. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఎలాగూ ప్రొడక్షన్ పార్ట్ నర్ కాబట్టి ఇవన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఉత్తరాది బయ్యర్లు మాత్రం డుంకీకె మొదటి ప్రాధాన్యం ఇస్తామని, అయితే సలార్ డిమాండ్ ని మరీ తక్కువ అంచనా వేసి తమ మీద ఒత్తిడి తీసుకురావద్దని కూడా ప్రత్యేకంగా చెబుతున్నారట.

రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారబోతున్నాయి. ఇప్పటికే సలార్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఫుల్ యాక్టివ్ అయిపోయి రెండు వేలకు పైగా లొకేషన్లను బ్లాక్ చేసుకున్నారు. దీనికన్నా ఎక్కువ డుంకీ లోకల్ మార్కెట్ నే టార్గెట్ చేసుకుంది. దక్షిణాది రాష్ట్రాల్లో సలార్ వల్ల తీవ్ర ప్రభావం ఉంటున్నా సరే రీజనబుల్ గా స్క్రీన్లు వచ్చేలా పివిఆర్, ఐనాక్స్, సినీపోలీస్, మిరాజ్ తదితర మల్టీప్లెక్సుల సంస్థలతో చర్చలు జరిపే ఆలోచనలోనూ షారుఖ్ ఉన్నట్టు లీక్స్ వస్తున్నాయి. మొత్తానికి సలార్ ప్రకటన వచ్చినప్పటి నుంచి డుంకీ టీమ్ ఫుల్ యాక్టివ్ మోడ్ లోకి వెళ్లిపోయింది.