ప్రశాంత్ నీల్‌తో పోటీ.. వాళ్లకే కష్టం

ఈ ఏడాది చివర్లో భారీ బాక్సాఫీస్ వార్ చూడబోతున్నాం. హిందీలో భారీ అంచనాలున్న ‘డుంకి’ సినిమాతో.. సౌత్ మెగా మూవీ ‘సలార్’ ఢీకొనబోతోంది. ప్రభాస్ సినిమా అంటే ఆల్ ఇండియా రేంజ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ‘పఠాన్’, ‘జవాన్’ లాంటి బ్లాక్ బస్టర్లతో మాంచి ఊపు మీద ఉన్నాడు. పైగా రాజ్ కుమారి హిరాని ట్రాక్ రికార్డు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

ఆయన ఇప్పటిదాకా తీసిన చిత్రాలన్నీ బ్లాక్‌బస్టర్లయ్యాయి. దీంతో ‘డుంకి’ కూడా పెద్ద హిట్టవుతుందని అంచనాలున్నాయి. మరోవైపు ప్రభాస్ పరిస్థితి చూస్తే.. ‘బాహుబలి’ తర్వాత అతను చేసిన మూడు చిత్రాలూ డిజాస్టర్లు అయ్యాయి. ఈ కోణంలో చూస్తే ‘డుంకి’ని చూసి ‘సలార్’ టీమే భయపడాలి. కానీ క్రిస్మస్‌లో బాక్సాఫీస్ దగ్గర మాత్రం ‘సలార్’దే ఆధిపత్యం అవుతుందనే అంచనాలున్నాయి.

ప్రభాస్ ట్రాక్ రికార్డు ఎలా ఉన్నప్పటికీ.. అతను ఈసారి జట్టు కట్టింది ప్రశాంత్ నీల్‌తో కావడంతో బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమనే భావిస్తున్నారు. ప్రశాంత్ చివరి సినిమా ‘కేజీఎఫ్’ రెండు భాగాలూ బాక్సాఫీస్ దగ్గర ఎంతటి ప్రకంపనలు రేపాయో తెలిసిందే. మాస్ కథలనే సరికొత్తగా ప్రెజెంట్ చేయడంలో, మైండ్ బ్లోయింగ్ ఎలివేషన్లు, యాక్షన్ ఘట్టాలతో ప్రేక్షకులకు పిచ్చెక్కించడంలో ప్రశాంత్ నైపుణ్యం అందరూ చూశారు. అలాంటి దర్శకుడు ప్రభాస్ లాంటి మాచో హీరోతో జట్టు కట్టడంతో థియేటర్లలో మాస్ జాతర ఉంటుందనే అంచనాలున్నాయి.

దీనికి తోడు ప్రశాంత్ సినిమాలు కేజీఎఫ్-1, కేజీఎఫ్-2తో పోటీ పడ్డ సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి. ‘2018లో ‘కేజీఎఫ్-2’ మీద మరీ అంచనాలేమీ లేవు. ఆ సినిమా ధాటికి షారుఖ్ మూవీ ‘జీరో’ దారుణంగా దెబ్బ తింది. కన్నడలోనే కాక అన్ని భాషల్లోనూ ‘కేజీఎఫ్’ ప్రభంజనం సృష్టించింది. ఇక ‘కేజీఎఫ్-2’ ఏ స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసిందో తెలిసిందే. ఆ సినిమా ధాటికి ‘బీస్ట్’ సహా పలు చిత్రాలు దెబ్బ తిన్నాయి. కాబట్టి ఈసారి కూడా ప్రశాంత్ కొత్త చిత్రం ‘సలార్’తో పోటీ పడే సినిమాలే కంగారు పడాల్సి ఉంటుందని బాక్సాఫీస్ పండిట్లు అంటున్నారు.