ముగ్గురి మధ్య దోబూచులాట ‘మామా మశ్చీంద్ర’

ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ బలంగా ఉన్నా హీరోగా ఎదగడానికి తన వంతుగా కృషి చేస్తూ వెరైటీ పాత్రలను ఎంచుకుంటున్న సుధీర్ బాబు కొత్త సినిమా మామా మశ్చీంద్ర. క్యారెక్టర్ నటుడు కం రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెరైటీ థ్రిల్లర్ లో హీరో పాత్ర ట్రిపుల్ రోల్ చేయడం విశేషం. జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, కళ్యాణ్ రామ్, బాలకృష్ణల తర్వాత ఇప్పుడున్న వాళ్ళలో ఈ ప్రయోగం చేసింది సుధీర్ బాబే. ఇవాళ  అల్లు అర్జున్ మల్టీప్లెక్సులో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ చేశారు. ట్విట్టర్ లో మహేష్ బాబు చేతుల మీదుగా ఈ వీడియో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

కథేంటో క్లుప్తంగా వివరించారు. చెప్పుకోకూడని నేపధ్యమున్న ఒక వ్యక్తి(సుధీర్ బాబు)కి వయసు మళ్ళాక అతని గతం తాలూకు చేదు నీడలు వెంటాడుతు ఉంటాయి. చేసిన మంచి చెడులు ఎంత వద్దనుకున్నా వెక్కిరిస్తూ ఉంటాయి. తన వల్లే అన్యాయానికి గురైన ఇద్దరు కవల మేనల్లుళ్లు (సుధీర్ బాబు) ప్రతీకారానికి బదులు కూతుళ్లను(ఈషా రెబ్బ-మృణాళిని రవి)ని ప్రేమించడం చూసి షాక్ తింటాడు. వీళ్ళను కట్టడి చేయకపోతే ప్రమాదమని గుర్తించి దాగుడుమూతలు ఆపే ఉద్దేశంతో ప్రమాదాలకు స్వాగతం చెబుతాడు. అసలు ఈ ముగ్గురి వెనుక ఉన్న అసలు సస్పెన్స్ ఏంటో తెలియాలంటే సినిమా చూడాలి.

కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది. వృద్ధుడిగా, స్థూలకాయుడిగా, అందమైన యువకుడిగా మూడు రకాల షేడ్స్ లో సుధీర్ బాబు కొత్తగా ఉన్నాడు. ఎంటర్ టైన్మెంట్ తో పాటు బోలెడు థ్రిల్ కూడా దట్టించారు హర్షవర్ధన్. అలీ రెజా, రాజీవ్ కనకాల, అజయ్, మిర్చి కిరణ్ తదితరుల క్యాస్టింగ్ ఇంటరెస్టింగ్ గా ఉంది. చైతన్ భరద్వాజ్ నేపధ్య సంగీతం మూడ్ ని క్యారీ చేసింది. మొత్తానికి సైలెంట్ గా షూటింగ్ జరుపుకున్న మామా మశ్చీంద్ర ఇప్పుడీ ట్రైలర్ వల్ల ఒక్కసారిగా అటెన్షన్ తెచ్చుకుంది. మంచి పోటీ మధ్య అక్టోబర్ 6న థియేటర్లలో అడుగు పెడుతున్న ఈ థ్రిల్లర్ హైప్ ని అందుకుంటే ష్యుర్ షాట్ హిట్టే