గేమ్ ఛేంజర్ అసలు సమస్య ఇది

సెప్టెంబర్ చివరి వారం కోసం ప్లాన్ చేసుకున్న గేమ్ ఛేంజర్ షెడ్యూల్ వాయిదా వేస్తూ అధికారికంగా చెప్పేశారు. ఇలా జరగడం కొత్త కాకపోయినా టీమ్ నుంచి నోట్ రావడం మాత్రం అరుదే. హీరోయిన్ కియారా అద్వానీతో డేట్స్ తీసుకున్నాక కూడా ఈ సమస్య రావడంతో అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. అసలు కారణం ఏంటాని ఆరా తీస్తున్నారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం దర్శకుడు శంకర్ ప్లాన్ చేసుకున్న ఎపిసోడ్ కోసం క్యాస్టింగ్ మొత్తం పాల్గొనాల్సి ఉందట. అయితే కొందరు ఆర్టిస్టుల కాల్ షీట్లు ఎంత ప్రయత్నించినా సర్దుబాటు కాకపోవడంతో క్యాన్సిల్ చేయలేక తప్పలేదని వినికిడి.

ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిన పేరు ఎస్ జె సూర్య. గేమ్ ఛేంజర్ లో తనే మెయిన్ విలన్. అయితే ఆర్టిస్టుగా ఇతను చాలా బిజీ ఉన్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ తీస్తున్న జిగర్ తండా డబుల్ ఎక్స్ కీలక భాగం ఈ నెలలోనే ఉంది. మొన్నటిదాకా మార్క్ ఆంటోనీ ప్రమోషన్ల కోసం డైరీని ఖాళీగా ఉంచుకున్న ఎస్జె సూర్య హైదరాబాద్ లో ఉన్నప్పుడైనా గేమ్ ఛేంజర్ షూట్ ఉంటే కొంత వరకు కవరైపోయేది. సునీల్, జయరాం, శ్రీకాంత్ లు ఒకేసారి అందుబాటులోకి రాలేకపోతున్నారు. ఈ సమస్య పట్టిపీడించడం వల్లే తప్పని పరిస్థితిలో పోస్ట్ పోన్ చేసుకున్నారు. వచ్చే నెల రెండో వారంలో కొనసాగిస్తారు.

ఇక గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ కు సంబందించి ఇప్పట్లో నిర్ణయం తీసుకోవడం కష్టమే. అవతల ఇండియన్ 2 కూడా ఇదే స్టేజిలో ఉండటంతో శంకర్ మీద ఒత్తిడి అంతకంతా పెరుగుతోంది. రెండు ప్యాన్ ఇండియా సినిమాలే కావడం మరో చిక్కు. వీటిలో ఒకటి ఖచ్చితంగా 2024 ఇండిపెండెన్స్ డేకి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ అది ఎంత మేరకు సాధ్యమవుతుందో పోస్ట్ ప్రొడక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. తమన్ పాటల్లో ఒకటి ఆల్రెడీ లీకైపోగా టీమ్ వెంటనే అలెర్ట్ అయిపోయి తీయించేసింది కానీ సాంగ్ అప్పటికే విపరీతంగా వైరలైపోయింది.