ఇది నాయ‌ట్టు రీమేక్ కాద‌ట‌

రెండేళ్ల కింద‌ట మ‌ల‌యాళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం నాయ‌ట్టు. జోజు జోసెఫ్‌, కుంచుకో బోబ‌న్, నిమిష స‌జ‌య‌న్ ముఖ్య పాత్ర‌ల్లో మార్టిన్ ప్ర‌కాట్ రూపొందించిన ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద స‌క్సెస్ కావ‌డంతో పాటు క‌ల్ట్ స్టేట‌స్ అందుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్న‌ట్లు రెండేళ్ల కింద‌టే వార్త‌లొచ్చాయి. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో రావు ర‌మేష్‌, ప్రియ‌ద‌ర్శి, అంజ‌లి ముఖ్య పాత్ర‌ల్లో క‌రుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాను అనౌన్స్ చేశారు కూడా.

కానీ అనివార్య కార‌ణాల‌తో ఆ సినిమా ఆగిపోయింది. తర్వాత తేజ మ‌ర్ని ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్, రాహుల్ విజ‌య్, శివాని రాజ‌శేఖ‌ర్ ముఖ్య‌పాత్ర‌ల్లో కోట‌బొమ్మాళి పీఎస్ పేరుతో సినిమా ప‌ట్టాలెక్కింది. సినిమా పూర్తి కావ‌చ్చింది కూడా. ఈ సంద‌ర్భంగా టీం ప్రెస్ మీట్ పెట్టగా.. ఈ చిత్రం నాయ‌ట్టు రీమేక్ కాద‌ని నిర్మాత బ‌న్నీ వాసు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

అంద‌రూ త‌మ చిత్రం నాయ‌ట్టు రీమేక్ అనుకుంటున్నార‌ని.. కానీ అది నిజం కాద‌ని బ‌న్నీ వాసు తేల్చేశాడు. నాయ‌ట్టు నుంచి రెండు ముఖ్య‌మైన సీన్లు మాత్ర‌మే తీసుకుని.. మిగ‌తాదంతా కొత్త‌గా చేశామ‌ని.. సినిమాలో మ‌న నేటివిటీకి త‌గ్గ‌ట్లుగా చాలా కొత్త సీన్లు ఉంటాయ‌ని బ‌న్నీ వాసు అన్నాడు. నాయ‌ట్టు లాంటి క్లాసిక్‌ను రీక్రియేట్ చేయాల‌ని తాము అనుకోలేద‌ని వాసు స్ప‌ష్టం చేశాడు.

కోట బొమ్మాళి ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ తెలుగు సినిమా అని బ‌న్నీ వాసు చెప్పాడు. కోట‌బొమ్మాళి పీఎస్ సినిమాకు ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయ‌లేద‌ని.. అక్టోబ‌రు 13 లేదా న‌వంబ‌రు 24న రిలీజ్ చేస్తామ‌ని.. ఏదైనా ఫ‌స్ట్ కాపీ చేతికి రావ‌డం, మార్కెట్ ప‌రిస్థితుల‌ను బట్టి ఉంటుంద‌ని వాసు తెలిపాడు.  వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన త‌ర‌ఫున పోటీ చేస్తారా అని ఈ కార్య‌క్ర‌మంలో బ‌న్నీ వాసును ప్ర‌శ్నించ‌గా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అవ‌కాశ‌మిస్తే త‌ప్ప‌కుండా చేస్తాన‌ని స‌మాధానం ఇవ్వ‌డం విశేషం.