ప్రాజెక్ట్ K సీరియస్ అవ్వడం అవసరమే

ఒక ప్యాన్ ఇండియా సినిమా మీద వందల కోట్ల పెట్టుబడి పెట్టి వేలాది మంది పని చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఎలాంటి లీకైనా సరే ఏదో పోనీలెమ్మని వదిలేస్తే భవిష్యత్తులో మళ్ళీ రిపీటవుతూనే ఉంటాయి. ప్రాజెక్ట్ కె నిర్మాతలు అశ్వినిదత్ & కో లీకైన ఫోటో గురించి లీగల్ కేసుని ఫైల్ చేయడమే కాక దీనికి బాధ్యత వహించాల్సిన విఎఫ్ఎక్స్ కంపనీ నుంచి భారీ మొత్తాన్ని నష్టపరిహారంగా డిమాండ్ చేయాలని నిర్ణయించుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒక ఫోటోకే ఇంత తీవ్రంగా స్పందించాలా అంటే ఖచ్చితంగా ఔననే చెప్పాల్సి ఉంటుంది.

ఎందుకంటే ఇలా జరగడం కొత్త కాదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో ఉన్నప్పుడు రాజమౌళి ఎంత కఠినంగా ఉన్నా కూడా లీకులు బయటికొచ్చాయి. గేమ్ చేంజర్ పాట రాద్ధాంతం చూస్తూనే ఉన్నాం. గతంలో అత్తారింటికి దారేది రిలీజ్ కు ముందే హెచ్డి ప్రింట్ రావడం తీవ్ర కలకలం రేపింది. బ్లాక్ బస్టర్ అయ్యింది కాబట్టి సరిపోయింది లేకపోతే నిర్మాత పరిస్థితి ఏమయ్యేది. గుంటూరు కారం సైతం ఈ లీక్ వీడియోల బారిన పడుతోంది. కాబట్టి వేరొకరు భవిష్యత్తులో ఇలా చేయకుండా ఉండాలంటే ప్రాజెక్ట్ కె తరహాలో గుండెపోటు వచ్చే రేంజ్ లో డ్యామేజ్ సూట్ వేసి సొమ్ములు వసూలు చేయాలి.

అలా అయితేనే సినిమాకు పని చేస్తున్న బయటి సంస్థలు, లోపలివాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఈ లీకుల తలనెప్పి పెరుగుతోంది. కంటెంట్ ఏదైనా క్షణాల్లో పంపుకునే వెసులుబాటు రావడంతో వీటిని కట్టడి చేసే మార్గాలు క్లిష్టమవుతున్నాయి. ఎక్కడో ఒక చోట అయితే అడ్డుకోవచ్చు. సోషల్ మీడియాతో మొదలుపెట్టి వెబ్ సైట్స్ దాకా వందలాది ఆప్షన్లున్నాయి. వీటిని కనీసం కొంతవరకు నిలవరించాలంటే సీరియస్ యాక్షన్లు అవసరమే. మోతాదు పెద్దగా ఉంటేనే ఫలితం గట్టిగా వస్తుంది. చట్టపరమైన చర్యకు ఉపక్రమించారు కాబట్టి తీర్పు కూడా అనుకూలంగా వస్తే లీకర్స్ కి గుణపాఠంలా ఉంటుంది.