మహేష్ బాబు మల్టీప్లెక్స్ మీద ఏడుపెందుకు

మనం చేయలేం పక్కవాళ్ళు చేస్తే ఓర్వలేం అన్నట్టుంది కొందరి వ్యవహారం. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏఎంబి మల్టీప్లెక్స్ ద్వారా వెండితెర అనుభూతికి ఒక కొత్త డెఫినిషన్ ఇచ్చి ప్రేక్షకులకు ఇష్టమైన స్పాట్ గా మార్చిన మహేష్ బాబు త్వరలో బెంగళూరులోనూ ఇలాంటిది మొదలుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఏషియన్ భాగస్వామ్యంలో కెజి రోడ్డులో ఉన్న సుప్రసిద్ధ థియేటర్ కపాలి  స్థానంలో ఏడు స్క్రీన్ల సముదాయం తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 2024లో ప్రారంభించాలనే టార్గెట్ తో ఆఘమేఘాల మీద కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తున్నారు.

అయితే కొందరు కన్నడిగులు పక్కరాష్ట్రం వాళ్లొచ్చి మన ల్యాండ్ మార్క్స్ ని ఆక్రమించి వ్యాపారం చేయబోతున్నారని, ఇలాంటివి ప్రోత్సహిస్తే మున్ముందు ఇలాంటివి చాలా వస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో పోస్టులు మొదలుపెట్టారు. ఈ ట్రాప్ లో కొందరు పడుతున్నారు కూడా. వాస్తవం ఏంటంటే సదరు కపాలి థియేటర్ కు ఆదరణ లేక మూడేళ్ళ క్రితమే మూసేశారు. స్థానికులు ఎవరూ కొనేందుకు ముందుకు రాలేదు. రన్నింగ్ ఉన్న టైంలో రిలీజ్ సినిమాలు ఉన్నా సరే జనం పెద్దగా వచ్చేవారు కాదు. దీంతో ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గి నిర్వహణ భారమై అమ్మకానికి పెట్టారు.

ఇదంతా ఒక బిజినెస్ మోడల్ అంతే. అయినా బెంగళూరు నగరంలో ముప్పాతిక శాతం మల్టీప్లెక్సులు పివిఆర్, ఐనాక్స్, సినీపోలీస్ లే ఉన్నాయి. అత్యధిక రెవిన్యూ వీటి నుంచే వస్తుంది. ఇవన్నీ ఢిల్లీ. ముంబై కేంద్రంగా పని చేసే కార్పొరేట్ సంస్థలు. ఇప్పుడేదో మహేష్ బాబు ఏషియన్ కలిసి కొత్తగా మొదలుపెట్టిన సంస్కృతి కాదు. అలాంటప్పుడు ఈ ఏడుపులో లాజిక్ లేదు. అయినా కెజిఎఫ్, కాంతార లాంటి సినిమాల పుణ్యమాని శాండల్ వుడ్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. అలాంటివి మరిన్ని రావాలని కోరుకోవాలి కానీ ఇలా పక్కనే ఉన్న ఒక స్టార్ హీరో వచ్చి మల్టీప్లెక్స్ కట్టుకుంటే దాని మీద శోకాలు పెట్టడం కామెడీ.