స్టార్ హీరోలను రెడ్ కార్డులు ఆపుతాయా

మనది హీరోలు ఆధిపత్యం చెలాయించే పరిశ్రమ. వాళ్ళు చెప్పినట్టే జరగాలి తప్పించి డబ్బుంది కదాని నిర్మాతది లేదా రాసేది తీసేది నేనే కదాని దర్శకుడిది కాదు. అలా అని మరీ మితిమీరితే చర్యలు తీసుకునే సంఘాలు లేకపోలేదు. కాకపోతే అవి ఎంత వరకు పని చేస్తాయనేది భేతాళ ప్రశ్న. తాజాగా తమిళనాడు నిర్మాతల సమాఖ్య నలుగురు హీరోలకు రెడ్ కార్డు జారీ చేయాలని నిర్ణయించుకుంది. ఇది అమలులోకి వస్తే ఎవరూ వాళ్ళతో సినిమాలు తీయకూడదు. ఒకరకంగా చెప్పాలంటే పెదరాయుడులో రజనీకాంత్ విలన్ ఫ్యామిలీని ఊరి నుంచి దూరంగా వెలేసినట్టన్న మాట.

ఆ నలుగురు ఎవరంటే శింబు, ధనుష్, విశాల్, అధర్వ. వాళ్ళతో ప్రాజెక్టులు మొదలుపెట్టి నష్టపోయిన నిర్మాతలు ఆధారాలతో సహా కౌన్సిల్ కు కంప్లయింట్ ఇవ్వడంతో ఈ చర్య తీసుకోవాలని డిసైడ్ చేశారు. మైకేల్ రాయప్పన్ వివాదానికి సంబంధించి శింబు, తేనాండాళ్ సంస్థ సినిమా పూర్తి చేయకుండా నష్టానికి కారణమైనందుకు గాను ధనుష్, అసోసియేషన్ డబ్బులను తప్పుదారి పట్టించారనే అభియోగం మీద విశాల్, మతియజకన్ ఇష్యూలో అధర్వలు భాద్యులుగా నిలిచారు. ఎంత అడిగినా వీటి పరిష్కారానికి ముందుకు రాకపోవడంతో ఫైనల్  గా ఎర్ర జెండా ఊపేశారు.

వినడానికి బాగానే ఉంది కానీ ఇది నిజంగా అమలు జరిగే పనేనా అంటే డౌటే. ఎందుకంటే వీళ్ళందరికీ బలమైన బ్యాక్ గ్రౌండ్, సపోర్ట్, ఆర్థిక వనరులు, స్వంత ప్రొడక్షన్ హౌస్ లున్నాయి. అప్ కమింగ్ స్టేజిలో ఉంటే భయపడతారు కానీ ఇలాంటివి ఏదో రకంగా మధ్యవర్తిత్వం ద్వారా సాల్వ్ చేసుకుంటారు. అంత ఆలోచనే ఉంటే ఇక్కడి దాకా ఎందుకు వస్తుందనే వాదన కూడా నిజమే కానీ ప్రస్తుతానికి మాత్రం వీళ్ళ నుంచి నేరుగా స్పందన రాలేదు. బాష ఏదైనా మార్కెట్ ఉన్న హీరోలను ఇలాంటి వాటితో నియంత్రించడం కానీ శాశించడం కానీ నిజంగా జరిగే పనేనా.