అందరినీ నవ్వించిన పాకీజా.. ఇప్పడేమో భిక్షాటన చేస్తూ

ఇప్పటి తరానికి తెలియదు కానీ 90 దశకంలో సినిమాలు చూసినవాళ్లకు మాత్రం బాగా గుర్తుండిపోయిన కమెడియన్ వాసుకి. అసలు పేరు చెబితే ఫ్లాష్ కాదేమో, పాకీజా అంటే మాత్రం వెంటనే గుర్తొస్తారు. మోహన్ బాబు అసెంబ్లీ రౌడీలో బ్రహ్మానందంని మోసం చేసి పెళ్లి చేసుకునే సులబ్ కాంప్లెక్స్ క్లీనర్ గా ఆవిడ పండించిన కామెడీ మాములుగా పేలలేదు. ఆ ఎపిసోడ్ కోసమే మళ్ళీ మళ్ళీ చూసిన హాస్య ప్రియులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తెలుగు తమిళంలో సుమారు రెండు వందలకు పైగా సినిమాల్లో నటించిన పాకేజీ ప్రస్తుతం బిక్షాటన చేస్తూ బ్రతుకుతున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు.

వివరాల్లోకి వెళ్తే వాసుకి నటిగా మంచి పీక్స్ లో ఉన్నప్పుడే తల్లికి క్యాన్సర్ రావడంతో పాటు ఇతరత్రా కుటుంబ కారణాల వల్ల సంపాదించుకున్న సొమ్మంతా కరిగిపోయింది. ఆ తర్వాత తమిళనాడుకి జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ తరఫున స్పీకర్ పర్సన్ గా పలు బాధ్యతలు నిర్వహించారు. కానీ తలైవి చనిపోయాక వాసుకి పరిస్థితి మళ్ళీ తలకిందులయ్యింది. సినిమాల్లో అవకాశాలు రాక ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా చిరంజీవి రెండు లక్షలు పంపిస్తే ఆ డబ్బుతో అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చారు.

మంచు విష్ణు మా అసోసియేషన్ లో సభ్యత్వం ఇప్పించడంతో పాటు ఖరీదైన కంటి ఆపరేషన్ కూడా చేయించారు. యూసఫ్ గూడలో పది వేలకు ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్న వాసుకికి ఇక్కడ ఎలాంటి ఆఫర్లు రాకపోవడంతో తెచ్చుకున్న డబ్బంతా అయిపోయింది. చిత్రపురి కాలనీలో ఏదైనా వసతి దొరుకుంతుందేమో అనుకుంటే ఖాళీ లేకపోవడంతో విధి లేక తిరుపతి వచ్చేసి గోవిందరాజస్వామి ఆలయ ఆవరణలో బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తెలుగు పరిశ్రమే తనకు ఎంతో మంచి చేసిందని చెబుతున్న వాసుకి విధి ఆడిన వింత ఆటలో ఇలా యాచించే స్థితికి రావడం విచారకరం.