క్షమాపణ చెప్పిన సంగీత దిగ్గజం

నిన్న చెన్నైలో జరిగిన తమ మ్యూజికల్ లైవ్ కన్సర్ట్ సందర్భంగా జరిగిన రభస అభిమానుల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీయడంతో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దాని గురించి ఓపెనయ్యారు. జరిగింది తనకు తీవ్ర మనస్థాపం కలిగించిందని, బయట అంత గొడవ జరుగుతున్న సంగతి తెలియక లోపల పెర్ఫార్మన్స్ ఇవ్వడం మీద దృష్టి పెట్టడంతో చాలా విషయాలు చూసుకోలేదని ఒప్పుకున్నారు. ఫ్యాన్స్ వచ్చేది తన కోసమే కానీ ఈవెంట్ ఆర్గజైజ్ చేస్తున్న వాళ్ళ కోసం కాదని, కాబట్టి ఏది జరిగినా దానికి బాద్యత మనమే వహించాలని కొడుకుకి సైతం చెప్పానని వివరించాడు.

ఆయన వెర్షన్ లో వివరణ ఇలా ఉంది. సుమారు 45 వేలకు పైగా టికెట్లు అమ్మిన నిర్వాహకులు దానికి తగ్గట్టే కుర్చీలు ఏర్పాటు చేశారు. అయితే వచ్చిన జనం ఒకవైపే కిక్కిరిసి కూర్చుని ఇంకోవైపు వెళ్ళకపోవడంతో రద్దీ ఎక్కువైయ్యింది. దీంతో పోలీసులు సభా స్థలి ఫుల్ అయ్యిందని భావించి వెంటనే గేట్లు మూసేశారు. దాంతో టికెట్లు కొనుకున్న వేలాది ఆడియన్స్ నిరాశగా వెనుదిరగడం ఎవరూ పట్టించుకోలేదు. వచ్చినవాళ్లలో మహిళలు, చిన్నపిల్లలు ఎక్కువగా ఉండటం తన బాధని మరింత ఎక్కువ చేసిందన్న రెహమాన్ తప్పంతా తన మీదే వేసుకున్నారు.

ఎవరైతే వాపస్ వెళ్లిపోయారో వాళ్ళు తమ టికెట్లను ఈ మెయిల్ చేస్తే దానికి పరిహారంగా తీసుకునే చర్యలు వీలైనంత త్వరలో మొదలుపెడతామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఏదో అయిపోయింది లెమ్మని చేతులు దులిపేసుకోకుండా ఈ మాత్రం స్పందించడం మంచిదే. ఇప్పటిదాకా ఇండియాలో జరిగిన లైవ్ షోలలో అన్నింటిలోకి అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన ఈవెంట్ గా ఈ మరక్కుమ నెంజమ్ నిలిచిపోయింది. ఎన్నో మంచి పాటలు, అద్భుతమైన గాత్రాలతో పరవశించాల్సిన వేడుక ఇలా విమర్శలకు దారి తీసి సారీ చెప్పే దాకా వెళ్లడం విచారకరం.