తారక్ స్పందించకపోతే ఇన్ని అపార్థాలా  

గత రెండు రోజులుగా మీడియాతో పాటు ఏపీ రాజకీయాలను ఊపేసిన చంద్రబాబునాయుడు అరెస్ట్ తర్వాత జైలుకు వెళ్లడం లాంటి పరిణామాల పట్ల వేడి ఇంకా చల్లారలేదు. అయితే ఇంత జరుగుతున్నా జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడాన్ని అవకాశంగా తీసుకుని కొందరు బురదజల్లే పాలిటిక్స్ కి దారి మళ్లించడం కొత్త చర్చకు దారి తీస్తోంది. నిజమైన తారక్ అభిమానులు ఏర్పాటు చేయకపోయినా జగన్ కు థాంక్స్ చెబుతున్నట్టుగా కొందరు అదే పనిగా ఫ్లెక్సీలు చేయించి బహిరంగ ప్రదేశాల్లో కట్టి అదంతా జూనియర్ ప్రేరేపిత చర్యగా పబ్లిసిటీ చేయడం ప్రకోపానికి పరాకాష్ఠ.

ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం కొంత కాలం మినహాయించి జూనియర్ ఏనాడూ తెలుగుదేశం వ్యవహారాల్లో యాక్టివ్ గా లేడన్నది అందరికీ తెలిసిన వాస్తవం. తాత పార్టీ అయినా సరే మహానాడుకి హాజరు కావడం లాంటివి చేయలేదు. ప్రజా క్షేత్రంలో టిడిపి ఎంత పని చేస్తున్నా దానికి సంబంధించిన వ్యవహారాలను సోషల్ మీడియాలో పంచుకోవడం కానీ, మద్దతు తెలపడం కానీ చేయలేదు. ఎందుకంటే వయసు దృష్ట్యా తన ఫోకస్ మొత్తం కేవలం సినిమాల మీద ఉంది తప్పించి వేరే దాని గురించి ఆలోచించడం లేదు. అన్న కళ్యాణ్ రామ్ సైతం తమ్ముడి బాటలోనే ప్రొడక్షన్, యాక్టింగ్ రెండే చూసుకుంటున్నాడు.

అలాంటప్పుడు తారక్ స్పందించడం లేదని వాదన లేవనెత్తడం అర్థం లేని వ్యవహారం. ప్యాన్ ఇండియా సినిమా దేవర మీద చాలా ఒత్తిడి ఉంది. ఆ తర్వాత బాలీవుడ్ మూవీ వార్ 2 లో పాల్గొనాలి. ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ ని ఫైనల్ చేయాలి. నెక్స్ట్ చేయబోయే దర్శకులను లాక్ చేసుకునే దిశగా ఆలోచనలు చేయాలి. ఇవన్నీ పక్కనపెట్టి కొత్తగా ఇప్పుడు పొలిటికల్ గా స్పందిస్తే లేనిపోని తలనెప్పి తప్ప ఇంకేమీ ఉండదు. చంద్రబాబు నాయుడు తరఫున ఒకప్పుడు ప్రచారం చేసిన తారక్ కు ఇప్పుడు కొత్తగా కర్తవ్య బోధ చేయాల్సిన అవసరం లేదు. టైం వచ్చే వరకు ఆగడం తప్పించి ఏ మాత్రం తొందరపడినా ఎన్నికలు దగ్గరపడిన సమయంలో లేనిపోని రచ్చకు దారి ఇచ్చినట్టవుతుంది. అందుకే ఈ మౌనం. దాని మీదే ఇన్ని అపార్థాలు.