డుంకీ వల్ల అరుదైన రికార్డు మిస్

ఈ ఏడాది బాలీవుడ్ షారుఖ్ ఖాన్ నామ సంవత్సరంగా మారిపోయింది. పఠాన్, జవాన్ బ్లాక్ బస్టర్ల విజయంతో కింగ్ ఖాన్ ఆకాశంలో తేలుతున్నాడు. మూడేళ్ళ సుదీర్ఘమైన నిరీక్షణకు ఫలితం తిరుగులేని రూపంలో దక్కింది. వన్స్ ఏ స్టార్ ఆల్వేస్ ఏ స్టార్ అనే సూత్రాన్ని నిరూపిస్తూ మళ్ళీ సింహాసనం మీద కూర్చున్నాడు. పఠాన్ తో ఆల్రెడీ ఒక వెయ్యి కోట్ల గ్రాసర్ ని తన జేబులో వేసుకున్న షారుఖ్ జవాన్ తోనూ ఆ ఫీట్ సాధించబోతున్నాడు. ఇప్పటిదాకా ఈ ఘనత ఒకే ఏడాదిలో ఏ ఇండియా హీరో అందుకోలేదు. అయితే మరో ఎవర్ గ్రీన్ రికార్డు మాత్రం చేయి దాటిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

విలక్షణ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ రూపొందిస్తున్న డుంకీని షూటింగ్ మొదలుపెట్టినప్పుడే 2023 డిసెంబర్ విడుదలని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే చాలా భాగం పూర్తయ్యింది. ఇది కనక అనుకున్న టైంకి వస్తే కనక ఒకే ఇయర్ లో మూడు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చిన హీరోగా షారుఖ్ చరిత్రలో నిలిచిపోతాడని ఫ్యాన్స్ సంబరపడ్డారు. కానీ ప్రాక్టికల్ గా అది జరిగేలా లేదని బాలీవుడ్ టాక్. పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం అవసరం ఉండటంతో టీమ్ రాజీ పడేందుకు సిద్ధంగా లేదట. షారుఖ్ ఖాన్ సైతం వాళ్ళకే మద్దతు ఇవ్వడంతో మిస్ కావడం లాంఛనమే.

ఇరవై సంవత్సరాల కెరీర్ లో తీసింది అయిదు సినిమాలే అయినా అంత సులభంగా సాధ్యం కాని మైలురాళ్లను అందుకున్న రాజ్ కుమార్ హిరానీ అంటే వెంటనే గుర్తొచ్చేవి మున్నాభాయ్ సిరీస్, 3 ఇడియట్స్, పీకేలు. వాటిని మించిపోయేలా డుంకీని తీస్తున్నారని ఆల్రెడీ టాక్ ఉంది. అలాంటప్పుడు చెప్పిన టైంకి వచ్చి ఉంటే వసూళ్లు పోటెత్తేవి. ప్రస్తుతం 2024 కొత్త డేట్ గురించి చర్చలు జరుగుతున్నాయి. సలార్ కనక నవంబర్ లో వస్తే టైగర్ 3 డిసెంబర్ కి షిఫ్ట్ చేసి డుంకీని వచ్చే వేసవికి లేదా దీపావళికి రిలీజ్ చేసేలా ప్లానింగ్ అవుతోందని ట్రేడ్ టాక్. డుంకీలో తాప్సీ హీరోయిన్.