సత్యరాజ్ సినిమాని మార్చి జవాన్ తీశారా

బాహుబలి కట్టప్పగా మనకు బాగా పరిచయమైన సత్యరాజ్ ని క్యారెక్టర్ ఆర్టిస్టుగా చూస్తాం కానీ నిజానికాయన పాతికేళ్ల క్రితం కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు. బ్రహ్మ, ఎం ధర్మరాజు ఎంఏ, ఎస్పి పరశురామ్ ఒరిజినల్ వెర్షన్లలో ఈయనే కథానాయకుడు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకనే సందేహం వచ్చిందా. బాక్సాఫీస్ వద్ద విరుచుకుపడుతున్న జవాన్ దర్శకుడు అట్లీ సహజంగానే పాత హిట్ల నుంచి స్ఫూర్తి పొందటం అతని గత నాలుగు సినిమాల్లోనూ గమనించవచ్చు. తాజాగా సెన్సేషన్ సృష్టిస్తున్న సినిమా సైతం కమల్ హాసన్ ఖైదీ వేట నుంచి ఇన్స్ పైర్ అయ్యిందనే వార్త గతంలోనే వచ్చింది. ఇప్పుడో కొత్త ట్విస్టు.

1989లో సత్యరాజ్ హీరోగా తాయ్ నాడు రిలీజయ్యింది. రాధికా హీరోయిన్. నిజాయితీ కలిగిన ఒక మిలిటరీ ఆఫీసర్ ని అన్యాయంగా కేసులో ఇరికించి శత్రువులకు సహకారం అందించాడన్న అభియోగం మీద అవమానం పాలు చేస్తారు. నిజం బయటికి రాకుండా చంపేస్తారు. ఆత్మహత్యగా చిత్రీకరిస్తారు. కుటుంబం అవమానం పాలవుతుంది. కొడుకు పెరిగి పెద్దవాడై తండ్రిని ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళను పట్టుకుని ప్రతీకారం తీర్చుకుంటాడు. ఈ రెండు పాత్రలు సత్యరాజ్ డ్యూయల్ రోల్ చేశారు. జవాన్ లో తండ్రిని బ్రతికించి అతని స్థానంలో దీపికా పదుకునేకి ఉరి వేయిస్తారు. ఇది ప్రధానమైన తేడా.

మక్కికి మక్కి అనలేం కానీ అట్లీ మీద 1980 నుంచి 2000 మధ్యలో వచ్చిన సినిమాల ప్రభావం తీవ్రంగా ఉన్న విషయం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. తేరి కూడా విజయ్ కాంత్ క్షత్రియుడు నుంచి తీసుకున్నదే. విజిల్ లో రాయప్ప పాత్ర దళపతిలో మమ్ముట్టిని పోలి ఉంటుంది. ఏదైతేనేం మాస్ మసాలాలతో వందల కోట్లు కొల్లగొట్టడమనే పనిలో నైపుణ్యం సాధించిన అట్లీ ఇకపై కూడా ఇదే దారిలో వెళ్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అల్లు అర్జున్ తో ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నాడనే టాక్ ఉంది కానీ అది నిజమవ్వాలని ఐకాన్ స్టార్ అభిమానులు మనసారా కోరుకుంటున్నారు.