సర్కారు దర్శకుడి మీదే విజయ్ భారం?

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘ఖుషి’ కి మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినా మరుసటి రోజు మెల్లగా కలెక్షన్స్ తో పికప్ అయింది. వీకెండ్ మంచి వసూళ్లు సాదించింది. కానీ తర్వాత అకాల వర్షాలు సినిమా కలెక్షన్స్ పై ఎఫక్ట్ చూపించాయి. అక్కడి నుండి సినిమా రెవెన్యూ పరంగా డ్రాప్ అవుతూ వచ్చింది. ఇక ఈ వీకెండ్ జవాన్ తెలుగు స్టేట్స్ లో భారీ వసూళ్లు రాబట్టనుంది. ఇప్పటికే డే 1 తెలుగు రాష్ట్రాల్లో ఊహించని కలెక్షన్స్ వచ్చాయి. మరో పక్క ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కూడా మంచి వసూళ్లు అందుకుంటుంది. 

ఈ లెక్కన చూస్తే విజయ్ ఈ సినిమాతో 100 కోట్ల గ్రాస్ చేరడం చాలా కష్టంగా కనిపిస్తుంది. విజయ్ ను స్టార్ ను చేసింది అర్జున్ రెడ్డి సినిమా అయినప్పటికీ 100 కోట్లతో టాప్ ప్లేస్ లో నిలపింది మాత్రం ‘గీత గోవిందం’. ఆ సినిమా తర్వాత విజయ్ వరుసగా ఫ్లాప్స్ , డిజాస్టర్స్ అందుకున్నాడు. లైగర్ తో మళ్ళీ 100 కోట్లు కొడతాడని భావిస్తే అది కూడా డిజాస్టర్ అనిపించుకుంది. ఇక ఖుషి మీదే ఆశలు పెట్టుకున్న విజయ్ కి ఈ సినిమా కూడా 100 కోట్ల గ్రాస్ అందించలేకపోయింది. సినిమాకు ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు.

బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 15 కోట్ల వరకూ రావాల్సి ఉంది. దీంతో ఇప్పుడు గీత గోవిందంతో 100 కోట్ల బ్లాక్ బస్టర్ అందించిన పరశురామ్ మీదే విజయ్ మళ్ళీ నమ్మకం పెట్టుకున్నాడు. పరశురామ్ డైరెక్షన్ లో విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కి థియేటర్స్ లోకి రాబోతుంది. ప్రస్తుతం విజయ్ ఈ సినిమా షూటింగ్ ను ఫాస్ట్ గా కంప్లీట్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. విజయ్ కి తొలి 100 కోట్ల సినిమా ఇచ్చిన దర్శకుడు పరశురామ్ మళ్ళీ ఈ సినిమాతో రౌడీ స్టార్ కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందిస్తాడేమో చూడాలి.